విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు బీసీసీఐ జట్టును ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఫామ్ లేమితో బాధపడుతున్న కోహ్లి.. భారత్ తరపున తన రెడ్ బాల్ జర్నీ ముగిసిందని బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు కాదు ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ సిరీస్ లోనే కోహ్లి రిటైర్మెంట్ ఆలోచనలు చేశాడని తెలిసింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలోనే విరాట్ కోహ్లి తన రిటైర్మెంట్ గురించి సూచనలు ఇచ్చాడు. మొదటి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత ఈ బ్యాటింగ్ మాంత్రికుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 'నా పని అయిపోయింది' అని కోహ్లి తన సహచరులకు చెప్పాడని, అయితే ఆ సమయంలో ఎవరూ సీరియస్గా తీసుకోలేదని ఆ రిపోర్ట్ పేర్కొంది.
బ్యాటింగ్ మాంత్రికుడు కోహ్లి.. ఆస్ట్రేలియాలో సిరీస్ లో పెర్త్లో సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. టోటల్ గా 190 పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడ్డ బంతిని వెంటాడి ఔటయ్యే వీక్ నెస్ ను కోహ్లి కొనసాగించాడు.
తన అద్భుతమైన టెస్ట్ కెరీర్లో కోహ్లీ 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు, ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కానీ గత 4 సంవత్సరాల నుంచి అతని సగటు 50 కంటే తక్కువగా ఉంది.
టెస్టు క్రికెట్ కు కోహ్లి రిటైర్మెంట్ ఆలోచనల నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగింది. కోహ్లి మనసు మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ బాధ్యతను ఓ పేరున్న దిగ్గజ క్రికెటర్ కు బీసీసీఐ అప్పగించిందని తెలిసింది. ఇంగ్లాండ్ టూర్ నేపథ్యంలో కోహ్లి జట్టులో ఉండటం ఎంతో అవసరమని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికితే టీమిండియాకు చావు దెబ్బ తగిలినట్లే.
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో భారత టెస్టు కెప్టెన్ ప్లేస్ ఖాళీ అయింది. ఈ సంధి దశలో పూర్తిస్థాయిలో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసేంతవరకూ కోహ్లీని మరోసారి సారథిగా నియమించాలనే చర్చ సాగిందని తెలిసింది. బీసీసీఐలోని మెజారిటీ సభ్యులు దీనికి ఓకే చెప్పారంటా. కానీ హెడ్ కోచ్ గంభీర్ మాత్రం వ్యతిరేకించాడని తెలిసింది.
ఇంగ్లాండ్ తో సిరీస్ ముఖ్యమైంది కాబట్టి తాత్కాలిక కెప్టెన్ వద్దని గంభీర్ అన్నాడంటా. తాత్కాలిక పరిష్కారం అవసరం లేదని, యువ ఆటగాడికి పగ్గాలు అప్పజెప్పాలని గంభీర్ చెప్పాడని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పాయి.
సంబంధిత కథనం