Virat Kohli: విరాట్ కోహ్లీ.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో.. మ్యాచ్ ఎప్పుడు?-virat kohli returns domestic ranji trophy after 13 years know delhi vs railways match date ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: విరాట్ కోహ్లీ.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో.. మ్యాచ్ ఎప్పుడు?

Virat Kohli: విరాట్ కోహ్లీ.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో.. మ్యాచ్ ఎప్పుడు?

Virat Kohli: విరాట్ కోహ్లీ మళ్లీ దేశవాళీ క్రికెట్‍లో అడుగుపెడుతున్నాడు. సుమారు 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. ఢిల్లీ తరఫున బరిలోకి దిగనున్నాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో.. మ్యాచ్ ఎప్పుడు? (AFP)

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 13 ఏళ్ల తర్వాత డొమెస్టిక్ క్రికెట్‍ ఆడనున్నాడు. ఢిల్లీ తరఫున దేశవాళీ టోర్నీ ‘రంజీ ట్రోఫీ’లో బరిలోకి దిగేందుకు విరాట్ సిద్ధమయ్యాడు. విరాట్ కోహ్లీ సుమారు మూడేళ్లుగా తన రేంజ్ ఫామ్‍లో లేడు. ముఖ్యంగా టెస్టుల్లో పేలవంగా వరుసగా విఫలం అవుతున్నాడు. గతేడాది న్యూజిలాండ్‍తో జరిగిన టెస్టు సిరీస్‍, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్రంగా నిరాశపరిచాడు. భారత ఆటగాళ్లకు దేశవాళీ టోర్నీలు ఆడాలని బీసీసీఐ కూడా గట్టిగా చెప్పింది. దీంతో మళ్లీ ఫామ్‍లోకి వచ్చేందుకు చాలాకాలం తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడు.

13 ఏళ్ల తర్వాత..

విరాట్ కోహ్లీ చివరగా 2012లో రంజీ ట్రోఫీ ఆడాడు. ఆ తర్వాతి నుంచి మళ్లీ దేశవాళీ క్రికెట్‍లో అడుగుపెట్టలేదు. ఫామ్ కోల్పోయినా డొమెస్టిక్ క్రికెట్ ఎందుకు ఆడడం లేదని విరాట్‍పై కొందరు మాజీలు విమర్శలు కూడా చేశారు. ఎట్టకేలకు సుమారు 13 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడనున్నాడు కోహ్లీ. యంగ్ బ్యాటర్ ఆయుష్ బదోనీ కెప్టెన్సీలో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‍లో బరిలోకి దిగనున్నాడు.

మ్యాచ్ ఎప్పుడు?

రైల్వేస్‍తో జనవరి 30 నుంచి జరిగే రంజీ ట్రోఫీ చివరి గ్రూప్ మ్యాచ్‍లో ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ కోచ్ సందీప్ సింగ్ వెల్లడించారు. రైల్వేస్‍తో మ్యాచ్‍కు తాను అందుబాటులో ఉంటానని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ, జట్టు మేనేజ్‍మెంట్‍కు కోహ్లీ సమాచారం ఇచ్చారని తెలిపారు. దీంతో జనవరి 30 నుంచి రైల్వేస్‍తో మ్యాచ్‍లో కోహ్లీ ఆడనున్నాడు.

ఫామ్ కోల్పోయిన విరాట్

మూడేళ్లుగా కోహ్లీ తన రేంజ్ ఫామ్‌లో లేడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‍లో వరుసగా విఫలం అవుతున్నాడు. గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్‍పై జరిగిన టెస్టు సిరీస్‍లో ఆరు ఇన్నింగ్స్‌లో కేవలం 93 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆరు ఇన్నింగ్స్‌లో 190 రన్స్ మాత్రమే సాధించాడు. ఈ సిరీస్‍లో ఓ సెంచరీ చేసినా ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అయ్యాడు.

గతేడాది న్యూజిలాండ్‍తో భారత్ 0-3తో టెస్టు సిరీస్ కోల్పోయింది. చరిత్రలో తొలిసారి స్వదేశంలో టెస్టు సిరీస్‍లో క్లీన్‍స్వీప్ అయింది టీమిండియా. ఆసీస్‍తో సిరీస్ కూడా ఓడింది. దీంతో బీసీసీఐ గుర్రుగా ఉంది. భారత ఆటగాళ్లు మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడి ఫామ్‍లోకి రావాలని సూచించింది. విరాట్ కోహ్లీతో పాటు, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా సహా మరికొందరు టీమిండియా ఆడగాళ్లు రంజీ ట్రోఫీ ఆడేందుకు రెడీ అయ్యారు.

సంబంధిత కథనం