సొంత‌గ‌డ్డ‌పై ఆర్సీబీ అద‌ర‌హో - గెలుపు ముంగిట బోల్తా కొట్టిన రాజ‌స్థాన్‌-virat kohli devdutt padikkal shines as rcb beat rajasthan royals by 11 runs in ipl 2025 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  సొంత‌గ‌డ్డ‌పై ఆర్సీబీ అద‌ర‌హో - గెలుపు ముంగిట బోల్తా కొట్టిన రాజ‌స్థాన్‌

సొంత‌గ‌డ్డ‌పై ఆర్సీబీ అద‌ర‌హో - గెలుపు ముంగిట బోల్తా కొట్టిన రాజ‌స్థాన్‌

Nelki Naresh HT Telugu

ఐపీఎల్ 2025లో సొంత‌గ‌డ్డ‌పై ఆర్సీబీ తొలి విజ‌యాన్ని అందుకున్న‌ది. గురువారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై థ్రిల్లింగ్ విక్ట‌రీని సాధించింది. విరాట్ కోహ్లి, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ మెరుపు హాఫ్ సెంచ‌రీల‌తో బెంగ‌ళూరును గెలిపించారు.

విరాట్ కోహ్లి

సొంత‌గ‌డ్డ‌పై ఆర్సీబీ అద‌ర‌గొట్టింది. బ్యాటింగ్‌లో కోహ్లి, ప‌డిక్క‌ల్‌, బౌలింగ్‌లో హేజిల్‌వుడ్‌, కృనాల్ పాండ్య రాణించ‌డంతో రాజ‌స్థాన్‌పై థ్రిల్లింగ్ విక్ట‌రీని సాధించింది. గురువారం చిన్న‌స్వామి స్టేడియం వేదికగా జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ 11 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఐపీఎల్ 2025లో సొంత గ‌డ్డ‌పై తొలి విజ‌యాన్ని ఆర్సీబీ త‌న ఖాతాలో వేసుకుంది.

ఆకాశ‌మే హ‌ద్దుగా...

206 ప‌రుగుల భారీ టార్గెట్‌తో బ‌రిలో దిగిన రాజ‌స్థాన్‌కు ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్‌, వైభ‌వ్ సూర్య‌వ‌న్షీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా య‌శ‌స్వి జైస్వాల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో బెంగ‌ళూరు బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. 19 బాల్స్‌లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 49 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. వైభ‌వ్ 12 బాల్స్‌లో రెండు సిక్స‌ర్ల‌తో 16 ప‌రుగులు చేశాడు.

హాఫ్ సెంచ‌రీకి చేరువ‌గా...

కెప్టెన్ రియాన్ ప‌రాగ్ కొద్దిసేపే క్రీజులో ఉన్న మెరుపులు మెరిపించాడు. ప‌ది బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 22 ప‌రుగులు చేశాడు. నితీష్ రానా (28 ప‌రుగులు)తో క‌లిసి ధృవ్ జురేల్ రాజ‌స్థాన్‌ను గెలుపు దిశ‌గా న‌డిపించాడు. భువ‌నేశ్వ‌ర్ వేసిన 18వ ఓవ‌ర్‌లో ధృవ్ జురేల్ రెండు సిక్స‌ర్లు, రెండు ఫోర్లు కొట్ట‌డంతో రాజ‌స్థాన్ స‌మీక‌ర‌ణం ఈజీగా మారింది.

చివ‌ర‌లో అద్భుతం...

12 బాల్స్‌లో 18 ప‌రుగులు చేయాల్సిన త‌రుణంలో ధృవ్ జురేల్‌ను ఔట్ చేసి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు హేజిల్‌వుడ్‌. 34 బాల్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 47 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరుకున్నాడు ధృవ్ జురేల్‌. 19వ ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన హేజిల్‌వుడ్ కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే ఇచ్చాడు. చివ‌రి ఓవ‌ర్‌లో య‌శ్ ధ‌యాల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

శుభ‌మ్ దూబేను ఫ‌స్ట్ బాల్‌కే ఔట్ చేశాడు. అదే ఓవ‌ర్‌లో హ‌స‌రంగ కూడా ర‌నౌట్ అయ్యాడు. చివ‌రి ఓవ‌ర్‌లో కేవ‌లం ఐదు ప‌రుగులే చేసిన రాజ‌స్థాన్ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హేజిల్‌వుడ్ 4, కృనాల్ పాండ్య రెండు వికెట్ల‌తో రాణించారు.

మెరుపు హాఫ్ సెంచ‌రీల‌తో...

అంత‌కుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరుకు కోహ్లి, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ మెరుపు హాఫ్ సెంచ‌రీల‌తో భారీ స్కోరు అందించారు. కోహ్లి 42 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 70 ప‌రుగులు చేయ‌గా...ప‌డిక్క‌ల్ 27 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 50 ర‌న్స్ చేశాడు.

చివ‌ర‌లో టిమ్ డేవిడ్ 23, జితేష్ శ‌ర్మ 20 ప‌రుగులు చేయ‌డంతో బెంగ‌ళూరు ఇర‌వై ఓవ‌ర్ల‌లో కేవ‌లం ఐదు వికెట్లు మాత్ర‌మే న‌ష్ట‌పోయి 205 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్‌, హ‌స‌రంగ మిన‌హా మిగిలిన వారు ధారాళంగా ప‌రుగులు ఇచ్చారు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం