ఐపీఎల్ అంటేనే కోట్లలో సాగే ఆట. ప్లేయర్స్, ఫ్రాంఛైజీలు, బీసీసీఐ.. ఇలా అందరిపైనా కోట్ల వర్షం కురుస్తుంది. కానీ ఈ మెగా లీగ్ ను గ్రౌండ్లో విజయవంతంగా నిర్వహించే అంపైర్లు ఎంత సంపాదిస్తారో మీకు తెలుసా? వాళ్ల నిర్ణయాలు మ్యాచ్ ఫలితాలనే మార్చేస్తాయి. అలాంటి అంపైర్ల జీతభత్యాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం.
ఐపీఎల్లో అంపైర్లకు భారీ జీతాలే ఉంటాయి. ఈ మెగా లీగ్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్ల విషయానికి వస్తే ఒక్కో మ్యాచ్ కు రూ.3 లక్షలు ఇస్తారు. అదే ఫోర్త్ అంపైర్ అయితే ఒక్కో మ్యాచ్ కు రూ.2 లక్షలు సంపాదిస్తారు. ఒకరకంగా ఇది చాలా ఎక్కువనే చెప్పాలి.
అయితే వాళ్లపై ఉండే ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఐపీఎల్లాంటి మెగా లీగ్ లో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. అలాంటి మ్యాచ్ లలో అంపైర్ల నిర్ణయాలు కాస్త అటూఇటూ అయినా.. ఫలితాలే తారుమారవుతాయి. దీంతో అంపైర్లు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఫీల్డ్ లో ఉండేది మూడు గంటలే అయినా.. ఆ కాస్త సమయంలోనే అంపైర్లు ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారు.
ఐపీఎల్ తో పోలిస్తే.. డొమెస్టిక్ క్రికెట్ లో అంపైర్ల జీతాలు చాలా తక్కువ. నిజానికి దేశవాళీ క్రికెట్ నుంచి బీసీసీఐకి వచ్చే ఆదాయం కూడా తక్కువ కావడంతో ఆ ప్రభావం అంపైర్ల జీతభత్యాలపైనా ఉంటుంది. ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ కు రూ.3 లక్షలు సంపాదించే అంపైర్లు.. డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం అందులో పదోవంతే అందుకుంటారు.
గ్రేడ్ బి అంపైర్ అయితే ఒక రోజుకు రూ.30 వేలు, గ్రేడ్ ఎ అంపైర్ అయితే రోజుకు రూ.40 వేలు సంపాదిస్తారు. నాలుగు రోజుల మ్యాచ్ అయితే రూ.1.2 లక్షల నుంచి రూ.1.6 లక్షలు ఇస్తారు. ఆ లెక్కన చూస్తే ఐపీఎల్ జరిగే నెలన్నర రోజుల్లో అంపైర్లు సంపాదించే మొత్తం.. డొమెస్టిక్ క్రికెట్ లో ఏడాదంతా చేసినా దక్కదు.
అంతర్జాతీయ క్రికెట్ అయినా సరే అంపైర్లు ఐపీఎల్లో సంపాదించేదానికి చాలా తక్కువే అందుకుంటారు. అందులోనూ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్లయితే కాస్త మెరుగ్గా సంపాదిస్తారు. ఈ ప్యానెల్లో ఉండే వాళ్లు ఏడాదికి కనీసం రూ.65 లక్షల నుంచి రూ.1.7 కోట్ల వరకూ వెనకేసుకుంటారు. మ్యాచ్ పరంగా చూస్తే టెస్ట్ మ్యాచ్ అయితే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు ఇస్తారు.
ఇక వన్డే మ్యాచ్ అయితే ఇది సుమారు రూ.2 లక్షలు, టీ20 అయితే రూ.1.2 లక్షలు వరకు ఉంటుంది. ఏ లెక్కన చూసినా.. ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ కు అందుకునే మొత్తం కంటే ఇవి చాలా తక్కువే. దీనినిబట్టి ఐపీఎల్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
సంబంధిత కథనం