ఐపీఎల్ 2025లో హోం గ్రౌండ్ లో బ్యాటింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ఆదివారం (ఏప్రిల్ 27) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో ఓ మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు) పోరాడాడు. ఆఖర్లో స్టబ్స్ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, ఓ సిక్సర్) టీమ్ స్కోరును 160 దాటించాడు.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీతో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ను పేసర్ హేజిల్ వుడ్ దెబ్బకొట్టాడు. అభిషేక్ పోరెల్ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులకు హేజిల్ వుడ్ ఎండ్ కార్డు వేశాడు. ఆ వెంటనే కరుణ్ నాయర్ (4)ను యశ్ దయాల్ పెవిలియన్ చేర్చాడు. డుప్లెసిస్ (26 బంతుల్లో 22) చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరుబోర్డు నెమ్మదిగా సాగింది.
ఆర్సీబీ బౌలర్లు చెలరేగుతుండటంతో బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్ పై కేఎల్ రాహుల్ పోరాడాడు. బౌండరీలు అంత ఈజీగా రాకపోవడంతో సింగిల్స్ తోనే స్ట్రైక్ రొటేట్ చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (15)ను హేజిల్ వుడ్ వెనక్కి పంపాడు.
స్పిన్నర్లు కృనాల్ పాండ్య (1/28), సుయాష్ శర్మ (0/22) కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ లో మెరుపులు లేకుండా పోయాయి. 16 ఓవర్లకు ఆ టీమ్ 117/4తో నిలిచింది.
ఇంకో నాలుగు ఓవర్లు మాత్రమే మిగిలి ఉండటంతో ఢిల్లీకి వేగంగా ఆడక తప్పలేదు. కానీ ఆ క్రమంలో వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ ఒకే ఓవర్లో కేెఎల్ రాహుల్, అశుతోష్ శర్మ (2)ను ఔట్ చేసి ఢిల్లీని చావుదెబ్బ తీశాడు. దీంతో ఢిల్లీ స్కోరు 150 దాటినా గొప్పే అనిపించింది. కానీ విప్రజ్ నిగమ్, స్టబ్స్ కలిసి ఢిల్లీకి పోరాడే స్కోరు అందించారు.
యశ్ దయాల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో స్టబ్స్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. లాస్ట్ ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన వెంటనే స్టబ్స్ ఔటైపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్ 2, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు.
సంబంధిత కథనం