టీ20ల్లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ను కైవసం చేసుకొని అదరగొట్టింది. 17 ఏళ్ల తర్వాత టీ20 టైటిల్ను టీమిండియా దక్కించుకుంది. 2007 తర్వాత రెండోసారి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. బార్బడోస్లో గత శనివారం (జూన్ 29) జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది రోహిత్ శర్మ సేన. అయితే, బెరిల్ తుపాను కారణంగా వెస్టిండీస్ నుంచి భారత జట్టు ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. ప్రత్యేక విమానంలో బయలుదేరిన టీమిండియా రేపు (జూలై 4) భారత్లో టీ20 ప్రపంచకప్ టైటిల్తో అడుగుపెట్టనుంది.
భారత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది రేపు (జూలై 4) ఉదయం ఢిల్లీలో ప్రత్యేక విమానం దిగుతారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అనంతరం ముంబైకు టీమిండియా బయలుదేరుతుంది. ముంబైలోని భారీ స్థాయిలో విక్టరీ పరేడ్ ఉండనుంది. ముంబైలోని ఎన్సీఏ నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ విజయయాత్ర సాగనుంది.
టీమిండియా విక్టరీ పరేడ్ రేపు (జూలై 4) సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. “మీ అందరితో ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని మేం ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. జూలై 4న సాయంత్రం 5 గంటలకు మెరైన్ డ్రైవ్, వాంఖడే వద్ద ఈ విజయాన్ని విక్టరీ పెరేడ్తో సెలెబ్రేట్ చేసుకుందాం” అని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.
బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ఈ విక్టరీ పరేడ్ గురించి ట్వీట్ చేశారు. ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు గౌరవంగా నిర్వహిస్తున్న విక్టరీ పరేడ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచి నిర్వహించిన విక్టరీ పరేడ్ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. మళ్లీ ఇప్పుడు జరుగుతోందని రోహిత్ సేన టైటిల్ అందుకున్న ఫొటోను జత చేశారు. 2007 తర్వాత 17 ఏళ్ల నిరీక్షణ అనంతరం మళ్లీ 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచింది భారత్.
టీమిండియా విక్టరీ పరేడ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. రేపు (జూలై 4) సాయంత్రం ఈ విజయోత్సవ యాత్ర మొదలుకానుంది.
ఈ విక్టరీ పరేడ్లో భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు పాల్గొనే అవకాశం ఉంది. ముంబై సాగర తీరం ప్రేక్షకులతో కిక్కిరిసిపోనుంది. ఈ పరేడ్కు బీసీసీఐ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా రేపు ఉదయం సుమారు 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోనుంది. ఆ తర్వాత టీ20 టైటిల్తో వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భారత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కలవనున్నారు. టీమిండియాతో మోదీ బ్రేక్ ఫాస్ట్ చేస్తారని తెలుస్తోంది. అనంతరం భారత ప్లేయర్లు ముంబైకి బయలుదేరనున్నారు. సాయంత్రం విక్టరీ పరేడ్ జరగనుంది. అనంతరం బీసీసీఐ కార్యాలయంలో టైటిట్ ఉంచనున్నారు. రాత్రికల్లా ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి.