IND vs PAK: ఎమర్జింగ్ ఆసియా కప్లో పాకిస్థాన్ ఏ టీమ్పై ఇండియా ఏ టీమ్ థ్రిల్లింగ్ విక్లరీని సాధించింది. ఈ మ్యాచ్లో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో అదరగొట్టగా...అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ ఫోర్లు, సిక్సర్లతో పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. భారీ టార్గెట్ను ఛేదించడంలో చివరలో తడబడిన పాకిస్థాన్ ఇరవై ఓవర్లలో 176 పరుగులు చేసింది. ఏడు పరుగులతో ఓటమి పాలైంది. చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్గా ఈ మ్యాచ్ సాగింది.చివరలో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇండియాకు అద్భుత విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ టీమ్కు అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పోటీపడి ఫోర్లు, సిక్సర్లు బాదారు. అభిషేక్ శర్మ 22 బాల్స్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 రన్స్ చేయగా...ప్రభ్సిమ్రాన్ 19 బాల్స్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 36 పరుగులు సాధించాడు. వీరిద్దరి జోరుతో ఇండియా ఏ టీమ్ ఐదు ఓవర్లలోనే యాభై పరుగులు దాటింది.
ఆ తర్వాత తిలక్ వర్మ కూడా దంచికొట్టడంతో టీమిండియా స్కోరు పరుగులు పెట్టింది. 35 బాల్స్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 రన్స్చేశాడు. అతడికి నేహాల్ వాధేరా(25 పరుగులు) చక్కటి సహకారం అందించారు. ఒకానొక దశలో టీమిండియా ఈజీగా రెండు వందల పరుగులు దాటేలా కనిపించింది. కానీ చివరలో బ్యాట్స్మెన్ తడబడటంతో 183 పరుగులు మాత్రమే చేసింది.
లక్ష్యఛేధనలో పాకిస్థాన్ గట్టిగానే పోరాడింది. ఓపెనర్ యాశిర్ ఖాన్ (22 బాల్స్లో 33 రన్స్) తో పాటు అరాఫత్ మిన్హాస్ (41 పరుగులు), అబ్దుల్ సమద్ (25 రన్స్) పాకిస్థాన్ను గెలిపించేలా కనిపించారు. పాకిస్థాన్ బ్యాటర్ల జోరుకు టీమిండియా బౌలర్లు అన్షుల్ కంబోజ్, రసిక్ సలామ్ బ్రేకులు వేశారు.
విజయానికి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు చేయగాల్సివుండగా...పాకిస్థాన్ పదహారు రన్స్ మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో అన్షున్ కంబోజ్ మూడు, రసిక్ సలామ్, నిషాంత్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. తన తదుపరి మ్యాచ్లో ఇండియా ఏ టీమ్ యూఏఈతో తలపడనుంది. సోమవారం ఈ మ్యాచ్ జరుగనుంది.