Team India meet Modi: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. రోహిత్ సేనతో సరదాగా గడిపిన పీఎం-team india meets pm narendra modi with t20 world cup trophy rohit sharma and team hand over the trophy to pm ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India Meet Modi: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. రోహిత్ సేనతో సరదాగా గడిపిన పీఎం

Team India meet Modi: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. రోహిత్ సేనతో సరదాగా గడిపిన పీఎం

Hari Prasad S HT Telugu

Team India meet Modi: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో సగర్వంగా స్వదేశంలో దిగిన టీమిండియా.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఆ ట్రోఫీ చూసి ఎంతో మురిసిపోయిన మోదీ.. టీమ్ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.

ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. రోహిత్ సేనతో సరదాగా గడిపిన పీఎం

Team India meet Modi: టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన సమయంలో ఎంతో బాధలో ఉన్నప్లేయర్స్ ను ఓదార్చిన మోదీ.. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న టీమ్ తో ఆనందాన్ని పంచుకున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటోలు దిగడంతోపాటు టీమ్ తో కాసేపు ముచ్చటించారు.

ప్రధాని మోదీతో టీమిండియా

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో గురువారం (జులై 4) ఉదయం న్యూఢిల్లీలో ల్యాండైన టీమిండియా.. ఆ తర్వాత కాసేపటికి ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసానికి వెళ్లి కలిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తోపాటు మిగిలిన టీమ్ సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ అందరూ మోదీని కలిశారు. గతేడాది నవంబర్ 19న వన్డే వరల్డ్ కప్ ఓడిన సమయంలో ఎంతో బాధలో ఉన్నప్పుడు టీమ్ ను కలిసిన మోదీ.. మళ్లీ ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్న టీమ్ తో సరదాగా గడిపారు.

ప్లేయర్స్, వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటోలు దిగిన మోదీ.. తర్వాత ప్లేయర్స్ అందరితో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రోహిత్ తోపాటు మిగతా ప్లేయర్స్ అందరూ తమ వరల్డ్ కప్ విన్నింగ్ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ప్లేయర్స్ తోపాటు మోదీ కూడా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కనిపించారు.

ముంబైకి టీమిండియా

మోదీని కలిసిన తర్వాత తమ హోటల్ కు వెళ్లిన టీమిండియా ప్లేయర్స్ అక్కడి నుంచి మళ్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ముంబైలో సాయంత్రం 5 గంటలకు జరగనున్న విక్టరీ పరేడ్ లో ప్లేయర్స్ పాల్గొననున్నారు. దీనికోసం ముంబైలో ఇప్పటికే ఓ ప్రత్యేక బస్ సిద్ధమైంది. ఆ బస్ టాప్ పైకి ఎక్కి వాంఖడే స్టేడియంలో నుంచి కిలోమీటర్ మేర ఈ విజయ యాత్ర సాగనుంది.

తర్వాత అదే స్టేడియం దగ్గర ప్లేయర్స్ ను సన్మాన కార్యక్రమం జరగనుంది. అటు ఢిల్లీతోపాటు ఇటు ముంబైలోనూ టీమిండియాకు స్వాగతం పలకడానికి వేల మంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు. గత శనివారం (జూన్ 29) జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగులతో చిత్తు చేసి రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా అందుకున్న విషయం తెలిసిందే.

రెండు టీ20 వరల్డ్ కప్ లు గెలిచిన తొలి ఇండియన్ ప్లేయర్ గా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. అంతేకాదు కపిల్ దేవ్, ధోనీ తర్వాత ఇండియాకు వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ అతడు. ఈ వరల్డ్ కప్ గెలవగానే అతనితోపాటు కోహ్లి, జడేజా కూడా టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

వరల్డ్ కప్ గెలిచిన నాలుగు రోజుల తర్వాత న్యూఢిల్లీలో అడుగుపెట్టిన టీమిండియాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. తర్వాత హోటల్ దగ్గర కూడా పండగ వాతావరణం నెలకొంది. అక్కడ కెప్టెన్ రోహిత్ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. తర్వాత హోటల్లో ప్రత్యేకంగా తయారు చేసిన కేకును ప్లేయర్స్ కట్ చేశారు.