వన్డే కెరీర్ ను ముగించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను ఉద్దేశించి టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ భావోద్వేగ లేఖ రాశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి నేపథ్యంలో స్మిత్ బుధవారం (మార్చి 5) వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, టీ20ల్లో కొనసాగుతానని తెలిపాడు.
2012లో సహారా పుణె వారియర్స్ తరఫున స్మిత్ ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. అప్పటి రోజులను యువరాజ్ గుర్తు చేసుకుంటూ.. ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ లెటర్ పోస్టు చేశాడు.
‘‘స్టీవ్.. 2012లో పుణె వారియర్స్ శిబిరంలోకి నువ్వు కుర్రాడిగా అడుగుపెట్టడం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేర్చుకోవాలనే ఆకలితో, నిరూపించుకోవాలనే ఆత్రుతతో కనిపించావు. బలాన్ని పెంచుకుంటూ నువ్వు ఎదిగిన తీరు చూశా. క్రికెట్లో దిగ్గజంగా నిన్ను నువ్వు మార్చుకోవడాన్ని చూశా. అది అద్భుతం కంటే ఏ మాత్రం తక్కువ కాదు’’ అని యువీ పేర్కొన్నాడు.
‘‘తొలినాళ్ల నుంచి రెండు సార్లు వరల్డ్ కప్ విన్నర్ గా మారే దిశగా నీ ప్రయాణం అంకితభావం, పట్టుదలతో సాగింది. ఆటపై నీ ప్రభావం నంబర్లను మించింది. నీ స్థితిస్థాపకత, ఆకలి, పెద్ద టోర్నీల్లో సత్తాచాటే సామర్థ్యం నిన్ను నిజమైన ఛాంపియన్ గా నిలిపింది. వన్డేల నుంచి తప్పుకొన్న నువ్వు.. తరాలకు స్పూర్తి కలిగించే వారసత్వాన్ని వదిలి వెళ్లావు. మిత్రమా.. నువ్వు ముందుకు సాగే మార్గం బాగుండాలని కోరుకుంటున్నా’’ అని యువీ ఇన్ స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చాడు. 2015, 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో స్మిత్ సభ్యుడు.
లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ గా 2010లో వెస్టిండీస్ పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్మిత్ 170 వన్డేలాడాడు. 43.28 సగటుతో 5800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలున్నాయి. చివరగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పై 96 బంతుల్లో 76 పరుగులు చేశాడు. కానీ భారత బౌలర్లు చెలరేగి ఆసీస్ ను కట్టడి చేశారు. ఆసీస్ పై విజయంతో భారత్ ఫైనల్ చేరుకోగా.. కంగారూ జట్టు ఇంటి ముఖం పట్టింది.
సంబంధిత కథనం