ఇండియన్ క్రికెట్ వాళ్ల సొత్తు కాదు.. 25 ఏళ్లుగా కామెంటరీ బాక్స్‌లో కూర్చొని విమర్శలు: గవాస్కర్‌పై గంభీర్ పంచ్‌లు-team india head coach gautham gambhir on sunil gavaskar says indian cricket not their property ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఇండియన్ క్రికెట్ వాళ్ల సొత్తు కాదు.. 25 ఏళ్లుగా కామెంటరీ బాక్స్‌లో కూర్చొని విమర్శలు: గవాస్కర్‌పై గంభీర్ పంచ్‌లు

ఇండియన్ క్రికెట్ వాళ్ల సొత్తు కాదు.. 25 ఏళ్లుగా కామెంటరీ బాక్స్‌లో కూర్చొని విమర్శలు: గవాస్కర్‌పై గంభీర్ పంచ్‌లు

Hari Prasad S HT Telugu

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ పై తీవ్రంగా మండిపడ్డాడు. అతని పేరు ఎత్తుకుండా పరోక్షంగా పంచ్‌లు కురిపించాడు. తన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీపై కామెంట్స్ చేసిన గవాస్కర్ ను ఘాటుగా విమర్శించాడు.

ఇండియన్ క్రికెట్ వాళ్ల సొత్తు కాదు.. 25 ఏళ్లుగా కామెంటరీ బాక్స్‌లో కూర్చొని విమర్శలు: గవాస్కర్‌పై గంభీర్ పంచ్‌లు

గౌతమ్ గంభీర్.. ఇండియన్ క్రికెట్ లో ముక్కుసూటిగా మాట్లాడుతూ విమర్శల పాలవుతాడని పేరున్న మాజీ క్రికెటర్. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్నాడు. తాజాగా అతడు ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పై పరోక్షంగా విరుచుకుపడ్డాడు. 25 ఏళ్లు కామెంటరీ బాక్స్ లో కూర్చొని, ఇండియన్ క్రికెట్ ను తమ సొత్తుగా భావిస్తుంటారని అతడు అనడ గమనార్హం.

గవాస్కర్‌పై గంభీర్ ఏమన్నాడంటే?

గవాస్కర్ పేరు ఎత్తకుండానే అతనిపై గంభీర్ విమర్శలు గుప్పించాడు. మంగళవారం (మే 6) జరిగిన ఏబీపీ న్యూస్ సమ్మిట్ లో గంభీర్ మాట్లాడాడు. “నన్ను విమర్శించడమే కొందరి పని. వాళ్లు విమర్శించినా సరే. కానీ కొందరు కామెంటరీ బాక్స్ లో 20, 25 ఏళ్లుగా కూర్చొన్నారు.

నేను చేసిన ప్రతి పనినీ వాళ్లు విమర్శించారు. ఇండియన్ క్రికెట్ వాళ్ల సొత్తు అని అనుకుంటారు. కానీ ఇండియన్ క్రికెట్ ఎవరి సొత్తూ కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయుల గుర్తింపు. అది అలాగే ఉంటుంది. నా కోచింగ్, నా రికార్డులు, నా ప్రైజ్ మనీని కూడా ప్రశ్నించారు” అని గంభీర్ అన్నాడు.

అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు

ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా నేను అందుకున్న ప్రైజ్ మనీ నేను ఏం చేశాను? ఎక్కడ పెట్టుబడి పెట్టానన్నది ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి వాళ్లు ఈ దేశంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నారైలుగా పని చేస్తున్నారు. వాళ్లు ఈ దేశంలో సంపాదించి విదేశాలకు తీసుకెళ్తుంటారు.

నేను ఓ భారతీయుడిని, నా తుది శ్వాస వరకూ భారతీయుడిగానే ఉంటాను. ట్యాక్స్ తప్పించుకోవడానికి ఎన్నారైగా మారను. అద్దాల మేడల్లో ఉండేవాళ్లు ఇతరుల ఇళ్లపైకి రాళ్లు విసరొద్దు” అని గంభీర్ అన్నాడు. కామెంటేటర్ల గురించి కూడా గంభీర్ స్పందించాడు.

“కామెంటరీ బాక్స్ లో ఎవరేమనుకుంటున్నారు? యూట్యూబ్ లో ఎవరేమంటున్నారు? బ్రాడ్‌కాస్టర్ లో ఎవరేమంటున్నారు, మీడియా ఏమంటోంది.. అది నా పని కాదు. వాళ్లు తప్పు లేదా ఒప్పు అని నిరూపించడం నా పని కాదు” అని గంభీర్ స్పష్టం చేశాడు.

గవాస్కర్ ఏమన్నాడంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సమయంలో ఇండియన్ టీమ్ కు బీసీసీఐ రూ.58 కోట్లు అనౌన్స్ చేసింది. దీనిపై ఆ తర్వాత స్పోర్ట్స్‌స్టార్ లో తాను రాసిన కాలమ్ లో గవాస్కర్ స్పందించాడు. తన ఇతర సపోర్టింగ్ స్టాఫ్ తో సమానంగానే ప్రైజ్ మనీ తీసుకున్న రాహుల్ ద్రవిడ్ అడుగుజాడల్లోనే గంభీర్ కూడా వెళ్లాలని గవాస్కర్ అన్నాడు.

గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ.. ద్రవిడ్ కు అదనంగా రూ.2.5 కోట్లు ఇవ్వాలని అనుకున్నా.. అతడు నిరాకరించాడు. ఇతర సపోర్టింగ్ స్టాఫ్ తో సమానంగానే అతడు కూడా ప్రైజ్ మనీ అందుకున్నాడు. గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ పైనే గంభీర్ ఇంత తీవ్రంగా స్పందించాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం