గౌతమ్ గంభీర్.. ఇండియన్ క్రికెట్ లో ముక్కుసూటిగా మాట్లాడుతూ విమర్శల పాలవుతాడని పేరున్న మాజీ క్రికెటర్. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్నాడు. తాజాగా అతడు ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పై పరోక్షంగా విరుచుకుపడ్డాడు. 25 ఏళ్లు కామెంటరీ బాక్స్ లో కూర్చొని, ఇండియన్ క్రికెట్ ను తమ సొత్తుగా భావిస్తుంటారని అతడు అనడ గమనార్హం.
నేను చేసిన ప్రతి పనినీ వాళ్లు విమర్శించారు. ఇండియన్ క్రికెట్ వాళ్ల సొత్తు అని అనుకుంటారు. కానీ ఇండియన్ క్రికెట్ ఎవరి సొత్తూ కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయుల గుర్తింపు. అది అలాగే ఉంటుంది. నా కోచింగ్, నా రికార్డులు, నా ప్రైజ్ మనీని కూడా ప్రశ్నించారు” అని గంభీర్ అన్నాడు.
“ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా నేను అందుకున్న ప్రైజ్ మనీ నేను ఏం చేశాను? ఎక్కడ పెట్టుబడి పెట్టానన్నది ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి వాళ్లు ఈ దేశంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నారైలుగా పని చేస్తున్నారు. వాళ్లు ఈ దేశంలో సంపాదించి విదేశాలకు తీసుకెళ్తుంటారు.
నేను ఓ భారతీయుడిని, నా తుది శ్వాస వరకూ భారతీయుడిగానే ఉంటాను. ట్యాక్స్ తప్పించుకోవడానికి ఎన్నారైగా మారను. అద్దాల మేడల్లో ఉండేవాళ్లు ఇతరుల ఇళ్లపైకి రాళ్లు విసరొద్దు” అని గంభీర్ అన్నాడు. కామెంటేటర్ల గురించి కూడా గంభీర్ స్పందించాడు.
“కామెంటరీ బాక్స్ లో ఎవరేమనుకుంటున్నారు? యూట్యూబ్ లో ఎవరేమంటున్నారు? బ్రాడ్కాస్టర్ లో ఎవరేమంటున్నారు, మీడియా ఏమంటోంది.. అది నా పని కాదు. వాళ్లు తప్పు లేదా ఒప్పు అని నిరూపించడం నా పని కాదు” అని గంభీర్ స్పష్టం చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సమయంలో ఇండియన్ టీమ్ కు బీసీసీఐ రూ.58 కోట్లు అనౌన్స్ చేసింది. దీనిపై ఆ తర్వాత స్పోర్ట్స్స్టార్ లో తాను రాసిన కాలమ్ లో గవాస్కర్ స్పందించాడు. తన ఇతర సపోర్టింగ్ స్టాఫ్ తో సమానంగానే ప్రైజ్ మనీ తీసుకున్న రాహుల్ ద్రవిడ్ అడుగుజాడల్లోనే గంభీర్ కూడా వెళ్లాలని గవాస్కర్ అన్నాడు.
గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ.. ద్రవిడ్ కు అదనంగా రూ.2.5 కోట్లు ఇవ్వాలని అనుకున్నా.. అతడు నిరాకరించాడు. ఇతర సపోర్టింగ్ స్టాఫ్ తో సమానంగానే అతడు కూడా ప్రైజ్ మనీ అందుకున్నాడు. గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ పైనే గంభీర్ ఇంత తీవ్రంగా స్పందించాడు.
సంబంధిత కథనం