టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి హఠాత్తుగా తప్పుకొన్నాడు. షాకింగ్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. దీనిపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్షన్ వైరల్ గా మారింది. రోహిత్ గురించి పేర్కొంటూ గంభీర్ ఎక్స్ లో పోస్టు చేశాడు. ఈ పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. పేలవమైన ఫామ్ కారణంగా తనను తాను జట్టు నుండి తప్పించుకున్న మొదటి భారత కెప్టెన్గా రోహిత్ నిలిచిపోతాడు.
గంభీర్, రోహిత్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నారు. ఇద్దరు కలిసి టీమిండియాకు ఆడారు. ఇద్దరూ 2007లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఇండియా జట్టులో ఉన్నారు. రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించిన తర్వాత గంభీర్ ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. "ఒక మాస్టర్, ఒక నాయకుడు, ఒక రత్నం!" అని రోహిత్ ఫోటోతో గంభీర్ పోస్టు చేశాడు.
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్, విరాట్ కోహ్లి భవిష్యత్తు గురించి అడిగినప్పుడు గంభీర్ ఒక సాధారణ సమాధానం ఇచ్చాడు. "మొదటగా, జట్టును ఎంపిక చేయడం కోచ్ పని కాదు. ఎంపిక చేయడం సెలెక్టర్ల పని. కోచ్ ఒక మ్యాచ్ ఆడే 11 మందిని మాత్రమే ఎంపిక చేస్తాడు. నా ముందు కోచ్ గా పని చేసిన వారు సెలెక్టర్లు కాదు. నేను కూడా సెలెక్టర్ను కాదు" అని గంభీర్ ఏబీపీ న్యూస్ 'ఇండియా ఎట్ 2047' సమ్మిట్లో పేర్కొన్నాడు.
"వాళ్లు (రోహిత్, కోహ్లీ) ఆడుతున్నంత కాలం జట్టులో భాగమై ఉండాలి. ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు ముగిస్తారనేది వ్యక్తిగత నిర్ణయం. మీరు ఎప్పుడు ఆపాలని ఏ కోచ్, ఏ సెలెక్టర్, ఏ బీసీసీఐ చెప్పలేదు. 45 ఏళ్ల వరకు కూడా హాయిగా ఆడవచ్చు. మిమ్మల్ని ఎవరు ఆపుతారు?" అని గంభీర్ అన్నాడు. టీమిండియా జూన్ 20 నుంచి ఐదు టెస్టుల కోసం ఇంగ్లాండ్లో పర్యటిస్తుంది.
రోహిత్ 2024-25 సీజన్లో 8 టెస్టుల్లో 11 ఇన్నింగ్స్లలో 10.93 సగటు నమోదు చేశాడు. ఓవరాల్ గా అతను 67 టెస్టుల్లో 40.57 సగటుతో 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. అతను మార్చి 2022లో విరాట్ కోహ్లీ స్థానంలో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. అతని కెప్టెన్సీలో భారత్ టెస్టుల్లో 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు ఖాతాలో వేసుకుంది.
సంబంధిత కథనం