సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్‌పై కోర్టుకెక్కిన ఆర్సీబీ ఓనర్లు.. మమ్మల్నే అవమానిస్తావా అంటూ.. అసలేం జరిగిందంటే?-sunrisers hyderabad batter travis head facing legal tussle with royal challengers bengaluru franchise owners ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్‌పై కోర్టుకెక్కిన ఆర్సీబీ ఓనర్లు.. మమ్మల్నే అవమానిస్తావా అంటూ.. అసలేం జరిగిందంటే?

సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్‌పై కోర్టుకెక్కిన ఆర్సీబీ ఓనర్లు.. మమ్మల్నే అవమానిస్తావా అంటూ.. అసలేం జరిగిందంటే?

Hari Prasad S HT Telugu

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, ఊబర్ సంస్థలపై కోర్టుకెక్కింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ. ఈ మధ్యే వచ్చిన యాడ్ తమను అవమానించడంతోపాటు కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఆ ఫ్రాంఛైజీ ఓనర్లు ఢిల్లీ కోర్టుకెక్కారు.

సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్‌పై కోర్టుకెక్కిన ఆర్సీబీ ఓనర్లు.. మమ్మల్నే అవమానిస్తావా అంటూ.. అసలేం జరిగిందంటే? (REUTERS)

ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ చిక్కుల్లో పడ్డాడు. అతనితోపాటు ఊబర్ ఇండియా సిస్టమ్స్ లిమిటెడ్ పై రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసు వేసింది. ఈ మధ్యే వచ్చిన ఓ యాడ్ లో తమను అవమానించడంతోపాటు కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆ సంస్థ ఆరోపించింది.

హెడ్ ఊబర్ యాడ్ ఇలా..

ట్రావిస్ హెడ్ చేసిన ఊబర్ యాడ్ తమను అవమానించేలా ఉందన్నది ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఓనర్లు వాదిస్తున్నారు. ఈ యాడ్ లో మొదట హెడ్ మరో వ్యక్తితో కలిసి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోకి చొరబడినట్లుగా చూపించారు. ఆ తర్వాత అక్కడ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ అని రాసి ఉన్న బోర్డుపై.. రాయల్లీ ఛాలెంజెడ్ బెంగళూరు అని హెడ్ మారుస్తాడు.

అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతని వెంట పడగానే.. అతడు ఊబర్ బైక్ బుక్ చేసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. సరదాగా చేసిన ఈ యాడ్ ను ఆర్సీబీ ఓనర్లు మాత్రం సీరియస్ గానే తీసుకున్నారు.

ఇవి అవమానించడమే..

ఈ యాడ్ పై ఆర్సీబీ ఓనర్ కంపెనీ అయిన రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇది బ్రాండ్ ను వక్రీకరించడం, కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడటమే అని వాదించింది. ఈ సాలా కప్ నమ్దే అనే ఆర్సీబీ నినాదాన్ని వాడటంపై కూడా ఆర్సీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

“ఇది ఆర్సీబీ ఉనికిని వెక్కిరించడం, పలుచన చేయడమే అవుతుంది” అని ఆర్సీబీ తరఫున న్యాయవాది శ్వేతశ్రీ మజుందార్ వాదించారు. ఆర్సీబీని అవమానిస్తూ ఊబర్ తన బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవడం చట్టవిరుద్ధమని కూడా స్పష్టం చేశారు. సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ కమర్షియల్ పార్ట్‌నర్ ఊబర్ కావడం గమనార్హం.

ఎదురుదాడికి దిగిన ఊబర్

ఆర్సీబీపై ఊబర్ ఎదురుదాడికి దిగింది. సరదాగా చేసినదానిని సరదాగానే తీసుకోవాలని, ఇలా కోర్టుకెక్కడం ఏంటని ఊబర్ వాదిస్తోంది. తాము యాడ్ లో బెంగళూరు అని వాడాము తప్ప.. ఎక్కడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని వాడలేదని, మరి బ్రాండ్ ను అవమానించడం అనే పాయింట్ ఎక్కడ అని ఊబర్ వాదిస్తుండటం గమనార్హం.

ఆర్సీబీ సరదా విషయాన్ని సరదాగా తీసుకోవాలి తప్ప.. ఇలా కోర్టులో దావా వేయడం ద్వారా కాదు అంటూ ఊబర్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదన విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఇక్కడ బ్రాండ్ కు అవమానం జరిగినట్లుగా పిటిషన్ ఫైల్ చేసిన వాళ్లు ఆధారాలతో నిరూపించాలని, అప్పటి వరకూ తీర్పును వెల్లడించలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం