Sunil Gavaskar: ఇక నుంచైనా ఆ తప్పు చేయొద్దు: బీసీసీఐకి గవాస్కర్ సూచన.. సెలెక్టర్లకు కూడా ఓ సలహా
Sunil Gavaskar: భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. బీసీసీఐకి ఓ గట్టి సూచన చేశారు. మరోసారి ఆ తప్పు చేయవద్దని చెప్పారు. ఆటగాళ్ల ఎంపిక గురించి కూడా సెలెక్టర్లకు ఓ సలహా ఇచ్చారు.
ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భారత్ ఓడిపోవడంతో కొందరు మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయాల్లో పొరపాట్లు జరిగాయనేలా విశ్లేషణలు చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లతో పాటు బీసీసీఐ, సెలెక్టర్లపై కూడా కొందరు ఫైర్ అవుతున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్, దిగ్గజం సునీల్ గవాస్కర్ మరోసారి ఈ విషయాలపై సూచనలు చేశారు. ఆ విషయంలో బీసీసీఐకి సలహా ఇచ్చారు. ఆసీస్ పర్యటనలో జరిగిన పొరపాటును రిపీట్ చేయవద్దని అన్నారు. ఆ వివరాలు ఇవే..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత ఆటగాళ్లు.. నాలుగు బ్యాచ్లుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. కలిసి ఒకేసారి పోలేదు. రెండో సంతానం కలగడంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆ సిరీస్లో తొలి టెస్టు ఆడలేదు. ఆలస్యంగా ఆసీస్ వెళ్లాడు. ఈ తతంగం అంతటిపై సునీల్ గవాస్కర్ ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐకి కీలక సూచనలు చేశారు.
ఆ తప్పు మళ్లీ జరగకూడదు
విదేశీ పర్యటన ఉన్నప్పుడు భారత ఆటగాళ్లనంతా ఒకేసారి పంపాలని, బ్యాచ్లుగా పంపే తప్పును మరోసారి చేయకూడదని బీసీసీఐకి సునీల్ గవాస్కర్ సూచించారు. “ఆస్ట్రేలియాలో తప్పు జరిగింది. ఇక అది రిపీట్ కాకూడదు. ఇంగ్లండ్కు జట్టు ఒకే గ్రూప్గా వెళ్లాలి. ఆస్ట్రేలియాకు వెళ్లినట్టు నాలుగు బ్యాచ్లుగా వెళ్లకూడదు. ఆస్ట్రేలియాలో తొలి రెండు రోజులు.. కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ లేకుండా జట్టు ఉంది. ఇలా చేసి హోమ్ టీమ్కు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. లీడర్షిప్ గ్రూప్ లేకుండా వెళితే.. కొన్ని సవాళ్లు ఎదురైనా ఇబ్బందులు పెరుగుతాయి. ఇంకోసారి ఇలా కాకుండా బీసీసీఐ చూసుకోవాలి. గాయమైతే ఎవరైనా ఆటగాళ్లు ఆలస్యంగా జాయిన్ కావొచ్చు. కానీ జట్టు పోరాటానికి సిద్ధంగా ఉందనే స్టేట్మెంట్ను ఇచ్చేలా లీడర్స్ వ్యవహరించాలి” అని గవాస్కర్ చెప్పారు.
ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు ఆడకుండా రోహిత్ శర్మను అనుమతించడంపైనే గవాస్కర్ ఎక్కువగా ఫోకస్ చేసి ఈ కామెంట్లు చేశారు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో మూడు టెస్టులు ఆడిన రోహిత్.. కేవలం 31 పరుగులే చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ను 1-3తో కోల్పోయింది టీమిండియా.
అంత మంది ఎందుకు!
ఆస్ట్రేలియా పర్యటనకు ఏకంగా 20 మంది ఆటగాళ్లను భారత సెలెక్టర్లు ఎంపిక చేయడాన్ని కూడా గవాస్కర్ తప్పుబట్టారు. ఇంత మందిని ఎంపిక చేస్తే.. సెలెక్షన్పై కచ్చితంగా లేరనేలా ఫీలింగ్ కలుగుతుందని ఇన్నారు. ఇంగ్లండ్ పర్యటనలో 16 మందికి మించి ప్లేయర్లను ఎంపిక చేయొద్దని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీకి గవాస్కర్ సూచించారు. ఎక్కువ మందిని ఎంపిక చేస్తే ప్రాక్టీస్కు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు.
సంబంధిత కథనం