ఐపీఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు వర్షం అంతరాయం. శనివారం (ఏప్రిల్ 26) ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న మ్యాచ్ కు వరుణుడు పిలవని అతిథిగా వచ్చాడు. కేకేఆర్ ఛేజింగ్ లో వాన రాకతో ఆట నిలిచిపోయింది. ఛేదనకు బ్రేక్ వచ్చింది.
కేకేఆర్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫస్ట్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేకేఆర్ ఛేదనలో ఒక ఓవర్ కంప్లీట్ అయింది. కేకేఆర్ 7/0తో ఉన్న టైమ్ లో బలమైన గాలులతో కూడిన వర్షం వచ్చింది. దీంతో ఆటకు బ్రేక్ ఇచ్చారు. పిచ్, గ్రౌండ్ ను కవర్లతో కప్పారు. కానీ బలమైన గాలుల ధాటికి కవర్లు వెళ్లి స్టాండ్స్ లో పడటం గమనార్హం.
వేగంతో వీస్తున్న గాలుల కారణంగా కవర్లను కప్పి ఉంచడం గ్రౌండ్ మెన్ కు కష్టంగా మారింది. ఎట్టకేలకు గ్రౌండ్ ను కవర్ చేయగలిగారు. వర్షంతో పాటు ఆకాశంలో మెరుపులు కూడా వస్తున్నాయి. క్రీజులో కేకేఆర్ ఓపెనర్లు గుర్బాజ్, సునీల్ నరైన్ ఉన్నారు.
వర్షం ఆగి, తిరిగి ఆట రాత్రి 10.35 లోపు స్టార్ట్ కావాల్సి ఉంది. ఆ తర్వాత ఎంత ఆలస్యమైతే కేకేఆర్ ఛేజింగ్ లో అన్ని ఓవర్లు లాస్ కావాల్సి ఉంటుంది. అప్పుడు టార్గెట్ ను కుదించే అవకాశం ఉంది. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓవర్లు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
కేకేఆర్ తో ఐపీఎల్ 2025 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. 200కు పైగా స్కోరు సాధించింది. ఆ టీమ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో ఆ టీమ్ బౌలర్లనే ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆటాడుకున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్), జోష్ ఇంగ్లిస్ (11 నాటౌట్) కలిసి లాస్ట్ లో టీమ్ స్కోరును 200 దాటించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం