సస్పెన్స్ వీడింది. రోహిత్ శర్మ తర్వాత భారత టెస్టు జట్టు కెప్టెన్ ఎవరినేది అధికారికంగా వెల్లడైంది. యంగ్ స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్.. టీమిండియా టెస్టు టీమ్కు కొత్త సారథి అయ్యాడు. జూన్ 20 నుంచి ఇంగ్లండ్ గడ్డపై జరిగే టెస్టు సిరీస్కు గిల్ సారథ్యం వహించన్నాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును సెలెక్టర్లు నేడు (మే 24) ప్రకటించారు. గిల్కు కెప్టెన్సీ అప్పగించారు. దీంతో భారత టెస్టు క్రికెట్లో గిల్ కెప్టెన్సీ అధ్యాయం మొదలుకానుంది.
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా పంత్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. కెప్టెన్సీ రేసులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరు బాగా వినిపించింది. అయితే, గాయాల భయంతో అతడిని కెప్టెన్గా చేయలేదని తెలుస్తోంది. బుమ్రా కూడా సారథ్యంపై అంతగా ఆసక్తి ప్రదర్శించలేదని సమాచారం. మొత్తంగా టీమిండియా టెస్టు పగ్గాలను శుభ్మన్ గిల్కు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్టర్లు అప్పగించారు.
ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్.. టీమిండియా టెస్టు జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. కరుణ్ నాయర్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. భారత తరఫున తాను ఆడిన ఆఖరు టెస్టులో ఆస్ట్రేలియాపై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి మళ్లీ అడుగుపెట్టాడు. టీ20ల్లో అదరగొడుతున్న అర్షదీప్కు కూడా తొలిసారి టీమిండియా టెస్టు జట్టులో ప్లేస్ దొరికింది.
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే భారత బరిలోకి దిగుతోంది. ఈ ముగ్గురు ఇటీవలే టెస్టు క్రికెట్కు గుడ్పై చెప్పేశారు. దీంతో క్లిష్టమైన ఇంగ్లండ్ గడ్డపై శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత ఎలా ప్రదర్శన చేస్తుందనే ఉత్కంఠ ఎక్కువగా ఉంది.
ఈ సిరీస్కు బ్యాటర్లుగా గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్ పంత్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా ఉంటాడు. ధృవ్ జురెల్ సెకండ్ వికెట్ కీపర్గా ఉన్నాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, షార్దూల్ ఠాకూర్, నితీశ్ కుమార్ రెడ్డి.. ఆల్ రౌండర్లుగా ఉన్నారు.
ఈ సిరీస్కు ఐదుగురు స్పెషలిస్ట్ పేస్ బౌలర్లుగా బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ను సెలెక్టెర్లు ఎంపిక చేశారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ ఒక్కడే ఉన్నాడు. ఆల్రౌండ్లు జడేజా, సుందర్ కూడా స్పిన్ బౌలింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఐదు టెస్టుల సిరీస్ సాగనుంది. తొలి టెస్టు జూన్ 20న హెడింగ్లేలో షూరు అవుతుంది.
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపికైన భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్ , వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ శార్దూల్ ఠాకూర్
సంబంధిత కథనం
టాపిక్