ఐపీఎల్ 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. అప్పుడు ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ఐపీఎల్ 2025లో మరోసారి ఈడెన్ లో అడుగుపెట్టాడు. కానీ ఈ సారి మాత్రం అతను పంజాబ్ కింగ్స్ కెప్టెన్. శనివారం కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ బెటర్ పర్ఫార్మెన్స్ తోనే సాగుతోంది. 8 మ్యాచ్ ల్లో ఆ టీమ్ 5 గెలిచింది. 3 ఓడింది. ప్లేఆఫ్స్ రేసులో ఆ టీమ్ దూసుకెళ్తోంది. అయితే గత మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో కంగుతిన్న పంజాబ్.. ఇప్పుడు కేకేఆర్ ను ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కోసం అజ్మతుల్లా ఒమర్ జాయ్, మ్యాక్స్ వెల్ పంజాబ్ కు ఆడుతున్నారు.
పంజాబ్ కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొండంత బలం. బ్యాటింగ్, కెప్టెన్సీలోనూ అతను అదరగొడుతున్నాడు. ఇక ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ లాంటి కుర్రాళ్లు సత్తాచాటుతున్నారు. బౌలింలో సీనియర్ స్పిన్నర్ చాహల్ ఫామ్ అందుకోవడం కలిసొచ్చేదే.
డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. 8 మ్యాచ్ ల్లో ఆ టీమ్ మూడు విజయాలు మాత్రమే సాధించింది. అయిదు మ్యాచ్ ల్లో ఓడింది. పంజాబ్ కింగ్స్ తో ఓడితే ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఛాన్స్ మరింత క్లిష్టంగా మారుతాయి. ఈ మ్యాచ్ లో రోమన్ పావెల్, చేతన్ సకారియాను కేకేఆర్ ఆడిస్తోంది.
వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, రసెల్ లాంటి బ్యాటర్లున్నా మిడిలార్డర్ లో కేకేఆర్ తీవ్రంగా విఫలమవుతోంది. ఆ టీమ్ కెప్టెన్ రహానె ఒక్కడే రాణిస్తున్నాడు. బౌలింగ్ లోనూ ఆ టీమ్ తేలిపోతోంది. పంజాబ్ తో గత మ్యాచ్ లో 111 టార్గెట్ ను కేకేఆర్ ఛేదించలేకపోయింది.
ఐపీఎల్ 2024లో ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్, పంజాబ్ కింగ్స్ తలపడ్డప్పుడు రికార్డులు బద్దలయ్యాయి. ఇదే తేదీ (ఏప్రిల్ 26) రోజు ఆ మ్యాచ్ జరగడం విశేషం. అప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 261/6 స్కోరు చేసింది. ఛేదనలో చెలరేగిన పంజాబ్ 2 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు ఉండగానే సంచలన విజయాన్ని అందుకుంది. మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి.
సంబంధిత కథనం