2024-25కు సంబంధించి ప్లేయర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను భారత క్రికెట్ నియంత్రణ బోర్డ్ (బీసీసీఐ) వెల్లడించింది. నేడు (ఏప్రిల్ 20) ఈ వివరాలను ప్రకటించింది. దేశవాళీ క్రికెట్కు డుమ్మా కొట్టిన కారణంగా గతేడాది సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయిన యంగ్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మళ్లీ చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు బీసీసీఐ ప్రకటించిన లిస్టులో వీరిద్దరికీ చోటు లభించింది. ఈ సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్లో ఎవరు ఉన్నారో ఇక్కడ తెలుసుకోండి.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో టాప్ గ్రేడ్ అయిన ఏ+లోనే సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరి ప్లేస్లు అలాగే కొనసాగాయి. అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రోహిత్, కోహ్లీ, జడేజా గుడ్బై చెప్పినా వారికి ఏ+ కాంట్రాక్ట్ కొనసాగించింది బీసీసీఐ. ఈ ముగ్గురు టెస్టులు, వన్డేలు ఆడుతున్నందున టాప్ గ్రేడ్లో కంటిన్యూ చేసింది.
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్లోకి ప్రమోషన్ పొందాడు. ఈ ఏ గ్రేడ్లో మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ కొనసాగారు. పంత్ ఈ గ్రేడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ బీలో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కింది. సూర్య కుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ కూడా ఇదే గ్రేడ్లో ఉన్నారు.
తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. గ్రేడ్ సీలోకి అతడు ప్రవేశించాడు. ఇషాన్ కిషన్ కూడా ఇదే గ్రేడ్లోకి వచ్చాడు. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, అభిషేక్ శర్మ, అక్షదీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా కూడా కాంట్రాక్టులోకి అడుగుపెట్టి గ్రేడ్ సీలో ఉన్నారు. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పటిదార్.. గ్రేడ్ సీలో కొనసాగారు.
గ్రేడ్లను బట్టి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోని ఆటగాళ్లకు పేమెంట్ ఉంటుంది. ఏ+ గ్రేడ్లోని ప్లేయర్లకు ఏడాదికి రూ.7కోట్లు, ఏ గ్రేడ్లోని వారికి రూ.5కోట్లు, బీ గ్రేడ్లోని ఆటగాళ్లకు రూ.3కోట్లు, సీ గ్రేడ్లో ఉన్న ప్లేయర్లకు రూ.1కోటి దక్కుతుందని సమాచారం. మ్యాచ్ ఫీజులు అదనంగా ఉంటాయి.
సంబంధిత కథనం