గతేడాది నవంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు కొత్త టీమ్ దొరికినట్లే కనిపిస్తోంది. ఐపీఎల్ 2025 లో అతను లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎల్ఎస్జీ జెర్సీతో శార్దూల్ బౌలింగ్ చేస్తున్న ఫొటోలను ఆ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడమే అందుకు కారణం.
కేవలం నెట్ బౌలర్ అయితే ఇంతటి ఎలివేషన్ ఉండదు కదా.. లార్డ్ శార్దూల్ ఆ టీమ్ కు ఆడటం ఖాయమే అనే కామెంట్లు వస్తున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో నిర్వహించిన మెగా వేలంలో శార్దూల్ అన్ సోల్డ్ గా మిగిలాడు. అతణ్ని ఏ ఫ్రాంఛైజీ కొనుక్కోలేదు. రెండు సార్లు పేరు వేలంలోకి వచ్చినా ఏ ఫ్రాంఛైజీ కూడా పట్టించుకోలేదు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడని శార్దూల్ తొమ్మిది మ్యాచ్ ల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే తీయడంతో పాటు 21 పరుగులే చేశాడు. మరోవైపు టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో శార్దూల్ పై ఏ ఫ్రాంఛైజీ కనికరం చూపలేదు.
దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన శార్దూల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 9 మ్యాచ్ ల్లో 24.53 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ముంబయి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలోనూ శార్దూల్ అదరగొట్టాడు. 9 మ్యాచ్ ల్లో 22.62 సగటుతో 35 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో శార్దూల్ మళ్లీ ఐపీఎల్ ఆడే ఛాన్స్ లను క్రియేట్ చేసుకుంటున్నాడు.
ఐపీఎల్ 2025 కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతోంది. ఐపీఎల్ 18 సీజన్ కు ఇంకా వారం కూడా సమయం లేదు. కానీ ఎల్ఎస్జీ పేసర్లు మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, అవేశ్ ఖాన్ కు ఇంకా ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ రాలేదు. వీళ్లు గాయాల నుంచి కోలుకుంటున్నారు. మరోవైపు ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కేవలం బ్యాటర్ గానే ఈ సీజన్ లో ఆడబోతున్నాడు.
ఈ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలతో సమస్యల్లో చిక్కుకున్న లక్నోను కాపాడేందుకు లార్డ్ శార్దూల్ వస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లో టెస్టు సిరీస్ ల్లో కష్టాల్లో ఉన్న టీమిండియాను శార్దూల్ ఆదుకున్న సంగతి తెలిసిందే. అందుకే లార్డ్ శార్దూల్ అంటూ ఫ్యాన్స్ అతణ్ని పిలుస్తారు. ఇప్పుడు లక్నోను ఆదుకునేందుకు శార్దూల్ వస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే శార్దూల్ ను జట్టులో చేర్చుకోవడంపై లక్నో ఫ్రాంఛైజీ ఇంకా ఎలాంటి ఆనౌన్స్ మెంట్ చేయలేదు.
సంబంధిత కథనం