చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. మే 3న జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తెను లైంగికంగా వేధించారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఓ సీనియర్ ఆదాయపు పన్ను అధికారి, మరొక వ్యక్తి కలిసి తమ కూతురును లైంగికంగా వేధించారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఐపీఎల్ 2025లో మే 3న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. తన కుమారుడు, కుమార్తెను వేధించారని ఓ ఐపీఎస్ అధికారి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురును లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. దీంతో ఓ సీనియర్ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్, మరో వ్యక్తిపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసు నమోదైంది. చిన్నస్వామి స్టేడియం సమీపంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.
మే 3న రాత్రి 9.40 గంటల సమయంలో చిన్నస్వామి స్టేడియంలోని ప్రీమియం సీటింగ్ ఎన్క్లోజర్ అయిన డైమండ్ బాక్స్లో రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తన కుమారుడిని (22) దుర్భాషలాడి, తన కుమార్తెను (26) అసభ్యంగా తాకారని ఓ ఐపీఎస్ భార్య ఆరోపించారు. తన పిల్లలను అసభ్య పదజాలంతో తిట్టి, బెదిరించి, వేధించారని ఆమె ఆరోపించారు.
వారు తన కుమార్తెను దుర్భాషలాడి, అసభ్యకరంగా ప్రవర్తించారని కూడా ఆమె తెలిపారు. మొత్తం ఘటనను తన కుమారుడు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు సీనియర్ ఆదాయపు పన్ను అధికారి అని పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా, బిఎన్ఎస్ సెక్షన్లు 351(1) (బెదిరింపులు), 352 (శాంతి భద్రతలకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 75(1) (లైంగిక వేధింపులు), 79 (స్త్రీ మర్యాదను అవమానించే ఉద్దేశ్యంతో చేసే చర్యలను నేరంగా పరిగణించడం) కింద ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఐపీఎస్ అధికారి కుమార్తె తన సీటుపై పర్సును ఉంచి వాష్రూమ్కు వెళ్లినప్పుడు ఈ గొడవ ప్రారంభమైందని తెలుస్తోంది. ఆమె తిరిగి వచ్చేసరికి వేరే వ్యక్తి ఆ సీటులో కూర్చున్నాడు. ఆమె సోదరుడు అతన్ని లేవమన్నాడు. కానీ అతను వినకపోవడంతో వాగ్వాదం జరిగింది. ఆ వ్యక్తితో పాటు అతని భార్య, ఆదాయపు పన్ను అధికారి, వారి కుమారుడు కూడా చేరి గొడవ పెద్దది చేశారు.
ఈ వాగ్వాదంలో ఐపీఎల్ ఆఫీసర్ కుమార్తె ను వేధించేలా వాళ్లు ప్రవర్తించినట్లు తెలిసింది. గొడవ ఎక్కువ కావడంతో ఆమె బ్రదర్ ఇంట్లో ఉన్న పేరేంట్స్ కు కాల్ చేశారు. స్టేడియానికి బయల్దేరిన ఆ ఐపీఎస్ అధికారి తన ఉన్నతాధికారుల సహాయం కోరినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంబంధిత కథనం