IND vs ZIM 5th T20: నామమాత్రమైన ఐదో టీ20లో టీమిండియా బ్యాట్స్మెన్ తడబడ్డారు. సంజూ శాంసన్ మినహా మిగిలిన ప్లేయర్లు రాణించలేకపోవడంలో ఆఖరి టీ20 మ్యాచ్లో జింబాబ్వే ముందు టీమిండియా 168 పరుగుల టార్గెట్ను విధించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించాడు. ఓపెనర్ జైస్వాల్ తొలి బంతినే స్టాండ్స్లోకి పంపించి దూకుడుమీద కనిపించాడు.
రెండో బంతిని కూడా సిక్స్గా మలిచాడు జైస్వాల్. కానీ అదే ఓవర్లో జైస్వాల్ జోరుకు సికిందర్ రజా బ్రేకులు వేశాడు. నాలుగో బంతికి బౌల్డయ్యాడు జైస్వాల్. కెప్టెన్ శుభ్మన్ గిల్ 13 రన్స్, అభిషేక్ శర్మ 14 పరుగులతో తక్కువ స్కోర్లకే ఔట్ కావడంలో టీమిండియా కష్టాల్లో పడింది.
రియాన్ పరాగ్తో కలిసి సంజూ శాంసన్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వీరిద్దరు కలిసి టీమిండియా స్కోరును వంద పరుగులు దాటించారు. రియాన్ పరాగ్ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్న పట్టుదలతో క్రీజులో నిలిచిన సంజూ శాంసన్ 39 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
హాఫ్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడబోయి ముజరబానీ బౌలింగ్లో శాంసన్ ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో 45 బాల్స్లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్తో 58 పరుగులు చేశాడు శాంసన్. చివరలో శివమ్ దూబే సిక్సర్లు, ఫోర్లతో మెరుపులు మెరిపించడంతో టీమిండియా ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది.దూబే 12 బాల్స్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 26 పరుగులు చేశాడు.
రింకు సింగ్ పదకొండు పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఐదో టీ20 మ్యాచ్ కోసం రుతురాజ్ గైక్వాడ్ను పక్కనపెట్టారు. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చాడు.జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ రెండు, సికిందర్ రజా, నగర్వా, మవుట తలో వికెట్ దక్కించుకున్నాడు.
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇప్పటికే టీమిండియా 3-1తో సొంతం చేసుకున్నది. తొలి టీ20 మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియా తర్వాత మూడు మ్యాచుల్లో జయకేతనం ఎగురవేసింది.