ఒక్క ఓవర్ ఒకే మ్యాచ్ లో రెండు జట్ల తలరాత మార్చింది. ఓడిపోతుందనుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కు విజయాన్ని అందించింది. కచ్చితంగా గెలుస్తుందనుకున్న రాజస్థాన్ రాయల్స్ కు ఓటమి మిగిలింది. ఆ లాస్ట్ ఓవర్ అద్భుతంగా వేసిన అవేశ్ ఖాన్ హీరోగా నిలిచాడు. ఈ థ్రిల్లింగ్ విక్టరీతో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కుర్చీలో నుంచి ఎగిరి గంతులేశారు. మరోవైపు షాకింగ్ ఓటమితో రాజస్థాన్ హెడ్ కోచ్ ద్రవిడ్ నిరాశలో మునిగిపోయాడు.
రాజస్థాన్ విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. కానీ లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేశ్ ఖాన్ అద్భుతమే చేశాడు. శనివారం (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో అవేశ్ 6 పరుగులే ఇచ్చాడు. అమేజింగ్ బౌలింగ్ తో టీమ్ ను గెలిపించాడు. ఈ విక్టరీతో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కుర్చీలో నుంచి లేచి గంతులేశారు. ఈ ఐపీఎల్ సీజన్ లో జట్టు వెంటే ఉంటూ ప్రోత్సహిస్తున్న సంజీవ్ తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న రాజస్థాన్ ఓటమి పాలవడంతో ఆ టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ ఆరో ఓటమి పాలవడంతో ద్రవిడ్ నిరాశతో డగౌట్లో కూర్చున్న ఫొటో ఫ్యాన్స్ ను బాధిస్తోంది.
యశస్వి జైస్వాల్ వరుసగా మూడో అర్ధసెంచరీ, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలన అరంగేట్రంతో రాజస్థాన్ చివరి మూడు ఓవర్లలో మరో 25 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడే మ్యాచ్ ను అవేశ్ ఆసక్తికరంగా మార్చాడు. 18వ ఓవర్లో జైస్వాల్, రియాన్ పరాగ్ ను ఔట్ చేశాడు.
ప్రిన్స్ యాదవ్ వేసిన 19వ ఓవర్లో హెట్ మయర్ రెండు బౌండరీలతో రాజస్థాన్ ఆశలను సజీవంగా ఉంచాడు. సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. కానీ అవేష్ తీవ్ర ఉత్కంఠలో గొప్పగా బౌలింగ్ చేశాడు.
ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది రాజస్థాన్. అందులో నాలుగు ఓటములు ఛేజింగ్ లోనే వచ్చాయి.
"భావోద్వేగాలను ప్రాసెస్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మేము ఏమి తప్పు చేశామో తెలియదు. మేము 18-19వ ఓవర్ వరకు మ్యాచ్ లో ఉన్నాం. బహుశా 19వ ఓవర్లోనే దాన్ని ముగించాల్సింది. నేనే బ్లేమ్ తీసుకుంటా. 40 ఓవర్ల పాటు సమష్టిగా ఆడితేనే గెలుస్తాం' అని ఆర్ఆర్ స్టాండ్ ఇన్ కెప్టెన్ పరాగ్ అన్నాడు.
సంబంధిత కథనం