ఇంగ్లండ్తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియాకు అగ్నిపరీక్ష ఎదురు కాబోతోంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇద్దరూ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో ఒకేసారి ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాలుగో స్థానంలో 12 ఏళ్లుగా టీమిండియాకు వెన్నుముకగా నిలిచిన కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇన్సైడ్ స్పోర్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ ఈ కామెంట్స్ చేశాడు. టీమిండియా తర్వాతి సూపర్ స్టార్ సాయి సుదర్శనే అని అతడు స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ తో సిరీస్ కు అతడు ఎంపికైనా.. ఇప్పటి వరకూ టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం మాత్రం చేయలేదు. అలాంటి ప్లేయరే విరాట్ కోహ్లి వారసుడు అని పనేసర్ అనడం గమనార్హం.
“ప్రస్తుతం జట్టులో కొందరు మంచి యువ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్లలో ఓ ప్లేయర్ సర్రేకు ఆడే సాయి సుదర్శన్. అతడు చాలా దూకుడుగా, భయం లేకుండా ఆడుతున్నాడు. ఇంగ్లిష్ కండిషన్స్ లో, సర్రే తరఫున అద్భుతంగా రాణించాడు. అతడే ఇండియన్ క్రికెట్ తర్వాత సూపర్ స్టార్ అని నేను భావిస్తున్నాను. అంతేకాదు నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు” అని పనేసర్ అన్నాడు.
ఈ సందర్భంగా టీమిండియా యువ ఆటగాళ్లను మాంటీ పనేసర్ ఓ రిక్వెస్ట్ చేశాడు. టెస్టుల్లో కోహ్లి వారసత్వాన్ని కొనసాగించాలని కోరాడు. “విరాట్ కోహ్లి లెగసీని కొనసాగిస్తే చూడాలని నేను కోరుకుంటున్నాను. అతడు టెస్ట్ క్రికెట్ ఆడిన తీరు చూస్తే.. యువ ఇండియన్ టెస్ట్ ప్లేయర్స్ కూడా అలాగే ఆడాలని భావిస్తున్నాను” అని పనేసర్ అన్నాడు.
నిజానికి టెస్టుల్లోనే కాదు.. ఓవరాల్గా కూడా విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ గా శుభ్మన్ గిల్ ను అందరూ పరిగణిస్తారు. కానీ పనేసర్ మాత్రం సాయి సుదర్శన్ పేరు చెప్పడం విశేషం. అతడు గత డొమెస్టిక్ సీజన్లో అద్భుతంగా రాణించాడు. ఈమధ్యే ముగిసిన ఐపీఎల్లోనూ చెలరేగాడు. ఇక కౌంటీల్లో సర్రే తరఫున ఇంగ్లండ్ కండిషన్స్ లో రాణించిన అనుభవం ఉండటంతో ఇప్పుడు ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో సాయి సుదర్శన్ ఆట కీలకం కానుంది.
సంబంధిత కథనం