అసాధ్యమనుకున్న సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును బ్రేక్ చేసే సత్తా ఉన్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లి అనూహ్యంగా టెస్టులకు గుడ్ బై చెప్పాడు. దీంతో ఇక ఆ రికార్డుకు వచ్చిన ముప్పు లేదని ఇప్పుడు క్రికెట్ పండితులు, ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం 82 సెంచరీలతో ఉన్న విరాట్.. కేవలం వన్డేల్లో మరో 19 సెంచరీలు కొట్టడం అంత సులువైన విషయం కాదు.
సచిన్ టెండూల్కర్ ఎప్పుడో 13 ఏళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీల రికార్డును నెలకొల్పాడు. ఆ సమయంలో తన రికార్డును ఎవరు బ్రేక్ చేసే అవకాశం ఉందని అడిగితే.. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అని అతడు అన్నాడు. ఇప్పుడీ ఇద్దరు క్రికెటర్లు టీ20, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.
కేవలం వన్డేల్లోనూ కొనసాగనున్నారు. విరాట్ ప్రస్తుతం మూడు ఫార్మాట్లు కలిపి 82 సెంచరీలు చేశాడు. మరో 18 చేస్తే సచిన్ ను సమం చేస్తాడు. 19 చేస్తే ఆ రికార్డు బ్రేక్ చేస్తాడు. కానీ ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లి ఆడే అవకాశం ఉంది.
అంతకంటే ముందు రెండేళ్లలో టీమిండియా కేవలం 27 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఈ మాత్రం మ్యాచ్ లలోనే విరాట్ 18 సెంచరీలు చేయడం అసలు ఎవరి ఊహకు కూడా అందని విషయమనే చెప్పాలి. దీంతో సచిన్ 100 సెంచరీల రికార్డు ఇక క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ అలా నిలిచిపోవడం ఖాయమని చెప్పొచ్చేమో.
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అసాధ్యమనుకున్న 100 సెంచరీల రికార్డును అందుకున్నాడు. వన్డే, టెస్టు ఫార్మాట్లలోనే మాస్టర్ ఈ ఘనత సాధించాడు. 200 టెస్టుల్లో 51 సెంచరీలు, 463 వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. ఇక విరాట్ కోహ్లి విషయానికి వస్తే 123 టెస్టుల్లో 30 సెంచరీలు, 302 వన్డేల్లో 51 సెంచరీలు, 125 టీ20ల్లో ఒక సెంచరీ చేశాడు.
మొత్తంగా విరాట్ 82 సెంచరీలు నమోదు చేశాడు. రోహిత్ శర్మ విషయానికి వస్తే అతడు మొత్తంగా 49 సెంచరీలు మాత్రమే చేశాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో 32, టీ20ల్లో ఐదు సెంచరీలు తన పేరిట రాసుకున్నాడు. సచిన్, కోహ్లి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో రికీ పాంటింగ్, కుమార సంగక్కర, జాక్ కలిస్, హషీమ్ ఆమ్లా, మహేల జయవర్దనె ఉన్నారు.
ఇక విరాట్ తర్వాత సచిన్ సెంచరీల రికార్డుకు అసలు చేరువగా వచ్చే మరో బ్యాటర్ ప్రస్తుతం క్రికెట్ లో లేడు. భవిష్యత్తులో వస్తాడో లేదో చూడాలి. దీంతో ప్రస్తుతానికి సచిన్ సెంచరీల రికార్డు సేఫ్ అనే చెప్పాలి.
సంబంధిత కథనం