దెబ్బకు దెబ్బ.. హోం గ్రౌండ్ లో ఢిల్లీని ఓడించిన ఆర్సీబీ.. కృనాల్, కోహ్లి అదుర్స్-royal challengers took revenge on delhi capitals by beating 6 wickets kohli krunal ipl 2025 points table top rcb ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  దెబ్బకు దెబ్బ.. హోం గ్రౌండ్ లో ఢిల్లీని ఓడించిన ఆర్సీబీ.. కృనాల్, కోహ్లి అదుర్స్

దెబ్బకు దెబ్బ.. హోం గ్రౌండ్ లో ఢిల్లీని ఓడించిన ఆర్సీబీ.. కృనాల్, కోహ్లి అదుర్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. దెబ్బకు దెబ్బ తీసింది. దాని హోం గ్రౌండ్ లోనే ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఐపీఎల్ 2025లో ప్రత్యర్థి స్టేడియాల్లో ఆర్సీబీకి ఇది వరుసగా ఆరో విక్టరీ. కృనాల్, కోహ్లి ఆర్సీబీని గెలిపించారు.

అదరగొట్టిన కోహ్లి, కృనాల్ పాండ్య (PTI)

ఐపీఎల్ 2025లో దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరుకుంది. ఆదివారం (ఏప్రిల్ 27) ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. 163 టార్గెట్ ను 4 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో రీచ్ అయింది.

కృనాల్ పాండ్య (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) ఆర్సీబీని గెలిపించారు. 10 మ్యాచ్ ల్లో ఏడో విజయంతో ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ కు ఆర్సీబీ మరింత చేరువైంది. హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ చేతిలో ఓటమికి.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో ఆర్సీబీ రివేంజ్ తీర్చుకుంది.

అక్షర్ తిప్పేసినా

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఛేజింగ్ లో ఆర్సీబీకి స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పిన్ తో దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జాకబ్ బెతెల్ (12), దేవ్ దత్ పడిక్కల్ (0)ను ఔట్ చేశాడు అక్షర్. ఆ తర్వాతి ఓవర్లోనే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ (6) రనౌటయ్యాడు. 26/3తో ఛేజింగ్ లో ఆర్సీబీ కష్టాల్లో పడింది.

కోహ్లి, కృనాల్ అదుర్స్

బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్ పై, ఢిల్లీ బౌలర్లను తట్టుకుని కోహ్లి, కృనాల్ నిలబడ్డారు. ఈ జోడీ ఫస్ట్ నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. క్రీజులో కుదురుకునేందుకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. పరిస్థితులకు అలవాటు పడేందుకు సమయం తీసుకుంది. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 64/3 మాత్రమే. అప్పటికీ కృనాల్ 21 బంతుల్లో 17, కోహ్లి 26 బంతుల్లో 28 పరుగులు చేశారు.

అక్కడి నుంచి బాదుడే

ఆర్సీబీ విజయానికి చివరి 10 ఓవర్లలో 99 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో కృనాల్, కోహ్లి దూకుడు పెంచారు. చమీర బౌలింగ్ లో సిక్సర్ తో కృనాల్ గేరు మార్చాడు. ముకేశ్ కుమార్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కుల్ దీప్ బంతిని కూడా స్టాండ్స్ లోకి పంపించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.

మరోవైపు కోహ్లి కూడా కృనాల్ కు చక్కగా సపోర్ట్ చేస్తూ ఇన్నింగ్స్ నడిపించాడు. స్టార్క్ బౌలింగ్ లో కృనాల్ క్యాచ్ ను అభిషేక్ పోరెల్ వదిలేయడం ఢిల్లీని దెబ్బతీసింది. కోహ్లి కూడా ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. ముకేశ్ ఓవర్లో కృనాల్ రెండు ఫోర్లు కొట్టడంతో సమీకరణం 18 బంతుల్లో 26 పరుగులుగా మారింది.

ఆఖర్లో ఉత్కంఠ

18వ ఓవర్లో కోహ్లి వికెట్ తీసిన చమీర 9 పరుగులే ఇచ్చాడు. సమీకరణం 12 బంతుల్లో 17 పరుగులుగా మారడంతో ఉత్కంఠ రేగింది. కానీ డేంజరస్ బ్యాటర్ టిమ్ డేవిడ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా పని పూర్తిచేశాడు. ముకేశ్ కుమార్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 6, 4, 4, 4తో డేవిడ్ మ్యాచ్ ముగించాడు.

భువీ, హేజిల్ వుడ్ మ్యాజిక్

అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 3, హేజిల్ వుడ్ 2, విల్ జాక్స్ 2 వికెట్లతో ఢిల్లీని దెబ్బకొట్టారు. ఆ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది.

కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు) పోరాడాడు. ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, ఓ సిక్సర్) లాస్ట్ లో భారీ షాట్లు కొట్టాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం