రోహిత్ శర్మ బుధవారం టెస్ట్ క్రికెట్కు తక్షణమే రిటైర్మెంట్ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్లో జరగబోయే సిరీస్కు ఎంపిక అవుతాడా లేదా అనే ఊహాగానాలకు తెరదించాడు. ఈ ప్రకటనతో అతని భార్య రితికా సజ్దేహ్ భావోద్వేగానికి గురైంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్టు వైరల్ గా మారింది.
"అందరికీ నమస్కారం. నేను టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నానని తెలియజేస్తున్నా. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గర్వంగా ఉంది. సంవత్సరాలుగా మీ ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. నేను వన్డే ఫార్మాట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాను," అని తన టెస్ట్ క్యాప్ యొక్క చిత్రంతో ఇన్స్టాగ్రామ్లో రోహిత్ స్టోరీ పోస్ట్ చేశాడు.
రోహిత్ టెస్టు రిటైర్మెంట్ పై అతని భార్య రితిక ఎమోషనల్ గా రియాక్టయింది. కన్నీళ్లు పెట్టుకుంది. రోహిత్ రిటైర్మెంట్ అనౌన్స్ మెంట్ స్టోరీని రితిక తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పంచుకుంది. దీంతో పాటు పగిలిన గుండె, సెల్యూట్, కన్నీళ్లతో ఉన్న ఎమోజీలను జత చేసింది. రోహిత్ రిటైర్మెంట్ నూ ఫ్యాన్స్ లాగే రితిక కూడా తట్టుకోలేకపోయింది.
38 ఏళ్ల రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్లో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని సగటు 40.57గా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి అతను సరిగ్గా ఆడకపోవడంతో ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ఎంపిక చేస్తారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సిరీస్ లోనే లాస్ట్ టెస్టు ఆడాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ ప్రకటన తర్వాత అతనికి ధన్యవాదాలు తెలిపింది. అతను వన్డే క్రికెట్లో భారతదేశానికి నాయకత్వం వహిస్తాడని ధృవీకరించింది.
"థాంక్యూ కెప్టెన్! టెస్టుల్లో ఒక శకం ముగిసింది! రోహిత్ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అతను వన్డేల్లో భారతదేశానికి నాయకత్వం వహిస్తూనే ఉంటాడు. మేము నిన్ను చూసి గర్విస్తున్నాము, హిట్ మాన్" అని బీసీసీఐ పోస్టు చేసింది.
సంబంధిత కథనం