Rohit Sharma on 46 All Out: కత్తులు తీయండిక.. 46 ఆలౌట్ తర్వాత మీడియాతో రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్-rohit sharma on 46 all out says chalo talwaar in press conference ind vs nz 1st test day 2 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma On 46 All Out: కత్తులు తీయండిక.. 46 ఆలౌట్ తర్వాత మీడియాతో రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్

Rohit Sharma on 46 All Out: కత్తులు తీయండిక.. 46 ఆలౌట్ తర్వాత మీడియాతో రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu

Rohit Sharma on 46 All Out: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియా 46 పరుగులకే ఆలౌటైన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ దారుణమైన ఇన్నింగ్స్ పై అతడు తనదైన రీతిలో స్పందించాడు.

కత్తులు తీయండిక.. 46 ఆలౌట్ తర్వాత మీడియాతో రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్ (AFP)

Rohit Sharma on 46 All Out: ఇండియాలోనే కాదు ఆసియాలోనే ఒక టెస్టు ఇన్నింగ్స్ లో అత్యల్ప స్కోరు అపవాదును మూటగట్టుకుంది టీమిండియా. న్యూజిలాండ్ పై తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే ఊహించని రీతిలో కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. ఇలాంటి అవమానం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎలాగూ కఠినమైన ప్రశ్నలు ఎదురవుతాయని ఊహించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తనదైన స్టైల్లో స్పందించాడు.

కత్తులు తీయండిక: రోహిత్

2020లో ఆస్ట్రేలియా టూర్లో ఇండియా టెస్టు క్రికెట్లోనే తన అత్యల్ప స్కోరు 36 రన్స్ చేసిన సంగతి తెలుసు కదా. మళ్లీ ఆ రోజును గుర్తుకు తెస్తూ ఈసారి స్వదేశంలోనే న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి వణికిపోయింది టీమిండియా. మ్యాట్ హెన్రీ నిప్పులు చెరిగే బంతులతో ఐదు వికెట్లు తీసి ఇండియన్ టీమ్ కు దారుణమైన అవమానాన్ని మిగిల్చాడు. దీనిపై ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చిన కెప్టెన్ రోహిత్ ఫన్నీగా స్పందించాడు.

"సరే ఇక కత్తులు బయటకు తీయండి" అంటూ రోహిత్ నవ్వుతూ రాబోయే కఠినమైన ప్రశ్నల కోసం సిద్ధమయ్యాడు. బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంపై రోహిత్ స్పందించాడు. "ప్రతి బ్యాటర్ బౌలర్ ను ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహంతోనే బరిలోకి దిగాడు. పిచ్ ఎలా ఉంది, ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు ఏదో చేయడానికి వెళ్లి మన ప్రణాళికలను సరిగా అమలు చేయలేం. ఇవాళ మాకు కలిసిరాలేదు. గతంలోనూ ఇలాంటి ఎన్నో మ్యాచ్ లు ఆడాడు. ఇదో సవాలు" అని రోహిత్ అన్నాడు.

కివీస్ బౌలర్లదే క్రెడిట్

ఇక ఈ దారుణమైన పతనం వెనుక క్రెడిట్ అంతా న్యూజిలాండ్ బౌలర్లదే అని రోహిత్ శర్మ అన్నాడు. "ఇక్కడి కండిషన్స్ న్యూజిలాండ్ కు బాగా కలిసొచ్చాయి. వాళ్ల స్వదేశంలో ఇలాంటి కండిషన్స్ లోనే ఎక్కువగా ఆడతారు. వాళ్ల బౌలర్లు మాకు సవాలు విసిరారు. మేము ప్రతి రెండు లేదా మూడో బంతి ఆడేలా చేశారు. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కచ్చితంగా ఏం చేయాలో వాళ్లు అదే చేశారు. బౌలర్లకు సాయం అందింది. దానిని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. ఆ సవాలుకు మేము సరిగా స్పందించలేకపోయాం" అని రోహిత్ స్పష్టం చేశాడు.

తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 46 పరుగులకే కుప్పకూలిన తర్వాత న్యూజిలాండ్ అదే పిచ్ పై రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఇప్పటికే ఆ టీమ్ కు 134 పరుగుల ఆధిక్యం లభించింది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ లో టీమిండియా గట్టెక్కడం అసాధ్యంగానే కనిపిస్తోంది.