టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి కూడా తప్పుకున్న అతడు.. తాజాగా ఐదు రోజుల ఫార్మాట్ కు కూడా గుడ్ బై చెప్పాడు. బుధవారం (మే 7) అతడు సడెన్ గా వెల్లడించిన ఈ విషయం అభిమానులను షాక్ కు గురి చేసింది. ఇక ఇప్పుడు ఇంగ్లండ్ లో ఐదు టెస్టుల సిరీస్ కు టీమిండియా కెప్టెన్ ఎవరన్న దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది.
టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు రోహిత్ శర్మ. అయితే వన్డే క్రికెట్ లో మాత్రం కొనసాగనున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనున్న నేపథ్యంలో రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం షాక్ కు గురి చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా రోహిత్ ఈ విషయం తెలిపాడు. “అందరికీ నమస్కారం.. నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరవుతున్నాను.
వైట్ జెర్సీలో నా దేశానికి ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇన్నేళ్లుగా మీరు అందించిన ప్రేమకు కృతజ్ఞతలు. వన్డే క్రికెట్ లో మాత్రం ఇండియన్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాను” అని రోహిత్ తన ప్రకటనలో వెల్లడించాడు. ఈ సందర్భంగా 280వ నంబర్ ఉన్న తన టెస్ట్ క్యాప్ ను కూడా పోస్ట్ చేశాడు.
రోహిత్ శర్మ 67 టెస్టుల్లో ఇండియన్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలతో 4301 పరుగులు చేశాడు. నవంబర్ 6, 2013లో వెస్టిండీస్ పై అతడు టెస్ట్ అరంగేట్రం చేశాడు. సుమారు 12 ఏళ్ల పాటు ఈ ఫార్మాట్లో కొనసాగాడు.
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ లో గతేడాది డిసెంబర్ 26న జరిగిన బాక్సింగ్ డే టెస్టే అతని కెరీర్లో చివరిది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీలో జరిగిన చివరి టెస్టు అతడు ఆడని విషయం తెలిసిందే. గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్ కు గురైనప్పటి నుంచీ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా టీమిండియా కోల్పోయింది.
దీంతో ఓ బ్యాటర్ గా, కెప్టెన్ గా రోహిత్ పై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటన సమయంలోనే రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో అలాంటిదేమీ లేదని చెప్పిన రోహిత్.. ఇప్పుడు ఐపీఎల్ మధ్యలో ఇలా టెస్టులకు గుడ్ బై చెప్పడం గమనార్హం. వన్డేల్లో మాత్రం కొనసాగుతానని చెప్పడంతో 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి కూడా అతడు తప్పుకున్న విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకోవడంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందో అన్న చర్చ మొదలైంది. గతేడాది టీ20ల నుంచి తప్పుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఆ పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోవడంతో అతని స్థానంలో ఎవరిని నియమిస్తారన్న ఆసక్తి నెలకొంది.
ఒకవేళ రోహిత్ వన్డేల్లో కెప్టెన్ గా కొనసాగితే.. మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండే పరిస్థితి వస్తుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా.. ఇంగ్లండ్ లో ఐదు టెస్టుల సిరీస్ కోసం వెళ్లాల్సి ఉండటంతో అప్పటిలోపే బీసీసీఐ కొత్త కెప్టెన్ ను నియమించాల్సి ఉంది.
బుమ్రా, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఈ రేసులో ఉన్నారు. గతంలో రోహిత్ లేని సమయంలో బుమ్రా కెప్టెన్సీ స్టాండిన్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇంగ్లండ్ సిరీస్ కోసం కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయాలన్న ఆలోచనలో సెలెక్షన్ కమిటీ ఉందన్న వార్తల నేపథ్యంలో ముందుగానే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటన చేయడం గమనార్హం.