రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు సొంతగడ్డపై చెలరేగారు. చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో కోహ్లి, పడిక్కల్ హాఫ్ సెంచరీలు చేయడంతోపాటు చివర్లో టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ మెరుపులతో భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 రన్స్ చేసింది. విరాట్ 70 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరి ఓవర్ ను జోఫ్రా ఆర్చర్ కట్టుదిట్టంగా వేయడంతో ఆర్సీబీ మరింత భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది.
సొంతగడ్డపై ఈ సీజన్లో తొలి విజయం కోసం ఆరాటపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. తొలి వికెట్ కు విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ 6.4 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. 23 బంతుల్లో 26 రన్స్ చేసిన సాల్ట్ ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్ తో కలిసి కోహ్లి జోరు కొనసాగించాడు. అతడు 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
పడిక్కల్ తో కలిసి అతడు రెండో వికెట్ కు 95 రన్స్ జోడించాడు. ఈ క్రమంలో 42 బంతుల్లోనే 70 రన్స్ చేసి ఔటయ్యాడు. కోహ్లి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. విరాట్ ఔటైన కాసేపటికే పడిక్కల్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో సరిగ్గా 50 పరుగులు చేసి ఔటయ్యాడు.
చివర్లో టిమ్ డేవిడ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ తో 23 రన్స్ చేయగా.. జితేశ్ శర్మ 10 బంతుల్లో 19 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక హసరంగ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.