రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంఛైజీని తాను కొనుగోలు చేస్తున్నానన్న పుకార్లను కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అద్భుతంగా ఖండించారు. యూకేకి చెందిన డియాజియో పిఎల్సి ఇండియా విభాగం డియాజియో ఇండియా, ఆర్సీబీ యాజమాన్య సంస్థ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని అమ్మకానికి పెడుతున్నారన్న ఊహాగానాలపై స్పందించిన మరుసటి రోజే శివకుమార్ మాట్లాడారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని తాను కొనుగోలు చేస్తున్నానన్న వార్తలపై బుధవారం (జూన్ 11) కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. "నేను పిచ్చివాడిని కాదు. నేను యువకుడిగా ఉన్నప్పటి నుంచీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లో సభ్యుడిని, అంతే.
నాకు సమయం లేదు. అయితే మేనేజ్మెంట్లో భాగం కావడానికి నాకు ఆఫర్లు వచ్చాయి. నాకు ఆర్సీబీ ఎందుకు కావాలి? నేను రాయల్ ఛాలెంజ్ (డ్రింక్) కూడా తాగను" అని శివకుమార్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అనడం గమనార్హం.
ఈ వారం వచ్చిన బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. బ్రిటిష్ డిస్టిలర్ ఆర్సీబీని విక్రయించడంపై సలహాదారులతో చర్చిస్తోంది. డియాజియో తన భారతీయ యూనిట్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ద్వారా ఈ టీమ్ ను కొనుగోలు చేసింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16,834 కోట్లు) వరకు ఈ ఫ్రాంఛైజీకి విలువ రావచ్చు.
ఈ అమ్మకం వార్తల తర్వాత.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో (BSE) నమోదైన యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు 3.3 శాతం పెరిగాయి. మంగళవారం (జూన్ 10) ఉదయం ఐదు నెలల గరిష్టాన్ని తాకాయి. దీంతో BSE డియాజియోకు మెయిల్ పంపింది. అందుకు డియాజియో స్పందిస్తూ.. ఈ రిపోర్టులు కేవలం ఊహాజనితమైనవని స్పష్టం చేసింది.
కంపెనీ సెక్రటరీ మిథల్ సంఘ్వి.. భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు పంపిన మెయిల్లో.. "పైన పేర్కొన్న మీడియా నివేదికలు ఊహాజనితమైనవని కంపెనీ స్పష్టం చేయాలనుకుంటుంది. అలాంటి చర్చలు ఏమీ జరపడం లేదు. ఇది మీ సమాచారం, రికార్డుల కోసం" అని స్పష్టం చేశారు.
ఐపీఎల్లో 17 సీజన్ల పాటు ట్రోఫీ గెలవని ఆర్సీబీ ఈసారి 18వ సీజన్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించారు. దీనికి రెండున్నర లక్షల మంది వరకు అభిమానులు రావడంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా పెను దుమారం రేగింది. కర్ణాటక ప్రభుత్వంతోపాటు ఆర్సీబీ యాజమాన్యం, విరాట్ కోహ్లిపైనా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
సంబంధిత కథనం