ఐపీఎల్ 2025లో మరో మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచేలా కనిపిస్తున్నాడు. మంగళవారం (మే 6) వాంఖడేలో జరుగుతున్న ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఛేజింగ్ లో గుజరాత్ 14 ఓవర్లకు 107/2తో ఉన్న సమయంలో వర్షంతో ఆట ఆగింది. అప్పటికీ డక్ వర్త్ లూయిస్ ప్రకారం చేయాల్సిన పరుగుల (99) కంటే గుజరాత్ ఎక్కువే చేసింది.
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తో ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఈ ఐపీఎల్ 18 సీజన్ లో సెన్సేషనల్ ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ ను రెండో ఓవర్లోనే బౌల్ట్ ఔట్ చేశాడు. సుదర్శన్ 5 రన్స్ మాత్రమే చేశాడు. అయినా కూడా బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్ పై శుభ్మన్ గిల్, బట్లర్ (30) నిలబడ్డారు.
పిచ్ బ్యాటింగ్ కు కష్టంగా ఉంది. పైగా ముంబయి టీమ్ లో డేంజరస్ బౌలర్లున్నారు. ఆ దశలో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు శుభ్మన్ గిల్, బట్లర్ గొప్ప పట్టుదల ప్రదర్శించారు. సింగిల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ, ఛాన్స్ రాగానే బౌండరీలు కొడుతూ స్కోరుబోర్డును నడిపించారు. పవర్ ప్లేలో ఆ టీమ్ స్కోరు 29 మాత్రమే. కానీ తర్వాత గుజరాత్ స్పీడ్ అందుకుంది.
ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య 11 బంతులు వేయడం గమనార్హం. అతను మూడు వైడ్లు, రెండు నోబాల్ లు వేశాడు. ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. మరోవైపు అశ్వని కుమార్ బౌలింగ్ లో గిల్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్ ను తిలక్ వర్మ వదిలేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే బట్లర్ ఔటైపోవడంతో 72 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఏ సమయంలోనైనా వర్షం వచ్చే ఛాన్స్ ఉండటంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఎక్కువ స్కోరు చేయాలనే ఉద్దేశంతో క్రీజులోకి వచ్చిన రూథర్ ఫర్డ్ దంచుడు మొదలెట్టాడు. విల్ జాక్స్ వేసిన 13వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు రూథర్ ఫర్డ్. అశ్వని కుమార్ ఓవర్లో మరో సిక్సర్ దంచాడు. 14 ఓవర్లు ముగిసే సరికి వర్షం ఎక్కువైంది. ఆటను ఆపేశారు. అప్పటికీ డీఎల్ఎస్ స్కోరు (99) కంటే గుజరాత్ ఎక్కువే చేసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ తడబడింది. ఆ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేసింది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిప్టీతో పోరాడాడు. సూర్యకుమార్ (35), కార్బిన్ బాష్ (27) కీలక పరుగులు చేశారు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిశోర్ రెండు వికెట్లతో రాణించాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. సిరాజ్, ప్రసిద్ధ్, అర్షద్, కొయెట్జీ తలో వికెట్ తీశారు.
సంబంధిత కథనం