ఐపీఎల్ 2025లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. మంగళవారం (మే 6) వాంఖడేలో జరుగుతున్న ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ను వర్షం వదలట్లేదు. ఛేజింగ్ లో గుజరాత్ 18 ఓవర్లకు 132/6తో ఉన్న సమయంలో మరోసారి వర్షం వచ్చింది.
డీఎల్ఎస్ ప్రకారం చూస్తే ఈ ఓవర్లకు చేయాల్సిన స్కోరు (137) కంటే గుజరాత్ 5 పరుగులు తక్కువే చేసింది. వర్షం ఆగకపోతే డీఎల్ఎస్ ప్రకారం ముంబయి విజయం సాధిస్తుంది. జీటీ ఇన్నింగ్స్ లో శుభ్మన్ గిల్ (46 బంతుల్లో 43; 3 ఫోర్లు, ఓ సిక్సర్) నిలబడ్దా స్లోగా ఆడాడు. బుమ్రా, బౌల్ట్, అశ్వని కుమార్ రెండేసి వికెట్లు తీశారు.
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తో ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఈ ఐపీఎల్ 18 సీజన్ లో సెన్సేషనల్ ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ ను రెండో ఓవర్లోనే బౌల్ట్ ఔట్ చేశాడు. సుదర్శన్ 5 రన్స్ మాత్రమే చేశాడు. అయినా కూడా బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్ పై శుభ్మన్ గిల్, బట్లర్ (30) నిలబడ్డారు. పవర్ ప్లేలో ఆ టీమ్ స్కోరు 29 మాత్రమే.
ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య 11 బంతులు వేయడం గమనార్హం. అతను మూడు వైడ్లు, రెండు నోబాల్ లు వేశాడు. ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. మరోవైపు అశ్వని కుమార్ బౌలింగ్ లో గిల్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్ ను తిలక్ వర్మ వదిలేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే బట్లర్ ఔటైపోవడంతో 72 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఏ సమయంలోనైనా వర్షం వచ్చే ఛాన్స్ ఉండటంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఎక్కువ స్కోరు చేయాలనే ఉద్దేశంతో క్రీజులోకి వచ్చిన రూథర్ఫర్డ్ (28) దంచుడు మొదలెట్టాడు. విల్ జాక్స్ వేసిన 13వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. అశ్వని కుమార్ ఓవర్లో మరో సిక్సర్ దంచాడు. 14 ఓవర్లు ముగిసే సరికి వర్షం ఎక్కువైంది. ఆటను ఆపేశారు. అప్పటికీ డీఎల్ఎస్ స్కోరు (99) కంటే గుజరాత్ (107) ఎక్కువే చేసింది.
వర్షం ఆగిపోవడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. గుజరాత్ సమీకరణం 36 బంతుల్లో 49 పరుగులుగా మారింది. వెంటనే బౌలింగ్ కు వచ్చిన బుమ్రా.. గిల్ ను ఔట్ చేసి వాంఖడేను హోరెత్తించాడు. ఆ తర్వాతి ఓవర్లో రూథర్ఫర్డ్ను బౌల్ట్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఈ సారి షారుక్ ఖాన్ (6)ను బౌల్డ్ చేశాడు బుమ్రా.
గుజరాత్ గెలవాలంటే 18 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి వచ్చింది. 18వ ఓవర్లో రషీద్ ఖాన్ ను ఔట్ చేసిన అశ్వని కుమార్ 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 18 ఓవర్లకు 132/6తో ఉన్నప్పుడు మళ్లీ వర్షం వచ్చింది. ఈ సారి డీఎల్ఎస్ స్కోరు కంటే జీటీ 5 పరుగులు వెనుకబడింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ తడబడింది. ఆ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేసింది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిప్టీతో పోరాడాడు. సూర్యకుమార్ (35), కార్బిన్ బాష్ (27) కీలక పరుగులు చేశారు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిశోర్ రెండు వికెట్లతో రాణించాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. సిరాజ్, ప్రసిద్ధ్, అర్షద్, కొయెట్జీ తలో వికెట్ తీశారు.
సంబంధిత కథనం