పాకిస్థాన్ కు దారుణ పరాభవం. ఆ దేశ క్రికెట్ బోర్డుకు ఘోర అవమానం. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్ లో మిగిలిన మ్యాచ్ లను నిర్వహించే అవకాశం లేక వాయిదా వేసుకుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎస్ఎల్ మిగిలిన మ్యాచ్ లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించాని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావించింది. కానీ అందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నో చెప్పడంతో పాక్ ఖంగుతింది.
భారత్, పాక్ మధ్య యుద్ధం ఉద్రిక్తతల కారణంగా పీఎస్ఎల్ 2025ను పీసీబీ నిరవధికంగా వాయిదా వేసింది. మొదట ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించేందుకు పీసీబీ ప్రయత్నించింది. కానీ భారత్ తో సత్సంబంధాల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అందుకు నో చెప్పింది. చివరకు చేసేదేం లేక పీఎస్ఎల్ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో పాకిస్థాన్ కు ఘోర అవమానం మిగిలింది.
ప్రధాని మహ్మద్ షాబాజ్ షరీఫ్ ఇచ్చిన సలహా మేరకు పాక్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. పీఎస్ఎల్ పదో ఎడిషన్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాకు చెందిన 37 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు.
వాస్తవానికి రావల్పిండి, ముల్తాన్, లాహోర్లో జరగాల్సిన చివరి ఎనిమిది పీఎస్ఎల్ మ్యాచ్ లను యూఏఈకి తరలిస్తామని పీసీబీ శుక్రవారం (మే 9) ప్రకటించింది. గురువారం రావల్పిండిలో పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ పాక్ కు యూఏఈ షాకిచ్చింది.
భారత్ తో యూఏఈకి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ అండా దండా కావాల్సిందే. 2021లో భారత్ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్ ను యూఏఈలో నిర్వహించారు. అలాగే 2020 ఐపీఎల్, 2021 ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లూ అక్కడే జరిగాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తన మ్యాచ్ లనూ యూఏఈలోనే ఆడింది. ఇక ఐసీసీ ప్రధాన కార్యాలయం కూడా దుబాయ్ లోనే ఉంది. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా భారత్ కు చెందిన జై షా ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో పీఎస్ఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చి భారత్ కు శత్రువుగా మారడం ఎందుకని యూఏఈ ఆలోచించిందని తెలిసింది. గతంలో పాకిస్థాన్ యూఏఈనే తమ హోం గ్రౌండ్ గా విదేశీ జట్లతో తలపడింది. అయినా పీఎస్ఎల్ నిర్వహణలో పాకిస్థాన్ కు యూఏఈ పరాభవాన్నే మిగిల్చింది.
సంబంధిత కథనం