పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. పవర్ ఫుల్ బీసీసీఐతో పోటీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సై అంటోంది. ప్రపంచ క్రికెట్లో అత్యంత రిచ్ లీగ్ అయిన ఐపీఎల్ జరిగే సమయంలోనే తమ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వహించేందుకు పీసీబీ సిద్ధమైంది. శుక్రవారం (ఫిబ్రవరి 28) పీఎస్ఎల్ 2025 సీజన్ షెడ్యూల్ ను పీసీబీ ప్రకటించింది. ఈ పదో సీజన్ ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు జరుగుతుంది.
పీఎస్ఎల్ లో ఆరు జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఇక ఈ లీగ్ లో బరిలో దిగే విదేశీ క్రికెటర్ల సంఖ్య కూడా తక్కువే. స్టార్ క్రికెటర్లు, డబ్బు, మ్యాచ్ లు, ఆదరణ.. ఇలా ఏ రకంగా చూసుకున్నా ఐపీఎల్ కు పీఎస్ఎల్ ఆమడ దూరంలో ఉంటుంది. అలాంటిది ఐపీఎల్ తో పోటీకి దిగుతోంది. అది పీఎస్ఎల్ కే ప్రమాదమన్న సంగతి పీసీబీ గుర్తించడం లేదు.
ఏప్రిల్ 11న పీఎస్ఎల్ పదో సీజన్ ఆరంభమవుతుంది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ తో రెండు సార్లు విజేత లాహోర్ ఖలందర్స్ తలపడబోతోంది. మే 18న ఫైనల్ జరుగుతుంది. రెండు ఎలిమినేటర్లు, ఫైనల్ సహా 13 మ్యాచ్ లకు గడాఫీ స్టేడియం వేదిక. ఈ లీగ్ మొత్తం మ్యాచ్ ల సంఖ్య 34 మాత్రమే.
అలాగే రాబోయే ఎడిషన్లో ఏప్రిల్ 8న పెషావర్లో ఎగ్జిబిషన్ మ్యాచ్ ను పీసీబీ నిర్వహించనుంది. ఈ మ్యాచ్ లో తలపడే జట్ల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ కూడా బరిలో దిగుతున్నాయి.
ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఈ 2025 సీజన్ ఫైనల్ మే 25న జరుగుతుంది. ఐపీఎల్ లో 10 జట్లు తలపడతాయన్న సంగతి తెలిసిందే. మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ సారి 13 స్టేడియాాలు ఐపీఎల్ 2025 మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనున్నాయి. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ తో ఆర్సీబీ పోటీపడుతుంది.
సంబంధిత కథనం