పాకిస్థాన్ సూపర్ లీగ్ ఈ మధ్యే ముగిసిన విషయం తెలిసిందే. ఫైనల్లో క్వెట్టా గ్లాడియేటర్స్ ను ఓడించి లాహోర్ ఖలందర్స్ మూడోసారి పీఎస్ఎల్ ట్రోఫీ గెలిచింది. అయితే ఈ ఫైనల్ గెలిచిన తర్వాత ప్లేయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమకు ఐఫోన్లు ఇస్తున్నారని తెలియగానే ప్లేయర్స్ అందరూ ట్రోఫీ గెలిచినదాని కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.
పాకిస్థాన్ సూపర్ లీగ్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీమ్ ను ఉద్దేశించి మొదట ఫ్రాంఛైజీ ఓనర్ మాట్లాడారు. తర్వాత కెప్టెన్ షహీన్ అఫ్రిది మాట్లాడుతూ.. ఈసారి అందరికీ ఐఫోన్లు ఇస్తున్నామంటూ అనౌన్స్ చేశాడు. అది విని ప్లేయర్స్ అంతా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ట్రోఫీ గెలిచినదాని కంటే ఎక్కువ సంబరపడిపోయారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మీ జీవితంలో ఎప్పుడూ ఐఫోన్లు చూడాలేదా అంటూ ఫ్యాన్స్ వాళ్లను ట్రోల్ చేస్తున్నారు.
ప్లేయర్స్ గట్టిగా అరుస్తూ, ఎగిరి గంతేస్తూ డ్రెస్సింగ్ రూమ్ లో నానా హంగామా సృష్టించారు. ఫైనల్లో 6 వికెట్లతో గెలిచిన లాహోర్ ఖలందర్స్ మూడోసారి ట్రోఫీ సొంతం చేసుకోవడం విశేషం. నిజానికి ప్రతి మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కు ఐఫోన్ ఇస్తూ వస్తున్నారు. అయితే ట్రోఫీ గెలిచిన తర్వాత ఈసారి ప్లేయర్స్ అందరికీ ఐఫోన్లు అని అనౌన్స్ చేయడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.
ఈ వీడియోను కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు. ఐఫోన్లు అనేది ఓ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ కు పెద్ద విషయమేమీ కాదని, కానీ ఈ ప్లేయర్స్ మాత్రం దానిని తొలిసారి చూస్తున్నట్లుగా ఎందుకింత సంబరపడిపోతున్నారని ఓ యూజర్ కామెంట్ చేశారు.
చీప్నెస్ కు ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదని, ట్రోఫీ గెలిస్తే ఐఫోన్ ఇవ్వడమేంటని మరొకరు ప్రశ్నించారు. మొత్తానికి పాకిస్థాన్ దేశమే కాదు.. అక్కడి క్రికెటర్లు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి పాకిస్థాన్ సూపర్ లీగ్ తో ఐపీఎల్ కు సవాలు విసరాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చూస్తుండటం మరీ విడ్డూరం.