ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను రద్దు చేయబోతున్నారా? పాక్ క్రికెట్ బోర్డుకు మరిన్నికష్టాలు-operation sindoor effect pakistan super league may get suspended pak cricket board considering the decision ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను రద్దు చేయబోతున్నారా? పాక్ క్రికెట్ బోర్డుకు మరిన్నికష్టాలు

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను రద్దు చేయబోతున్నారా? పాక్ క్రికెట్ బోర్డుకు మరిన్నికష్టాలు

Hari Prasad S HT Telugu

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ పాకిస్థాన్ సూపర్ లీగ్ మీద కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ కు పోటీగా పీఎస్ఎల్ కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీని ఉన్నపళంగా రద్దు చేసే ఆలోచనలో పాక్ క్రికెట్ బోర్డు కనిపిస్తోంది.

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను రద్దు చేయబోతున్నారా? పాక్ క్రికెట్ బోర్డుకు మరిన్నికష్టాలు (AFP)

ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చివరికి పాక్ క్రికెట్ బోర్డుకు కూడా దీనివల్ల కష్టాలు తప్పడం లేదు. ఈ 2025 ఎడిషన్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను సస్పెండ్ చేసే ఆలోచనలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జియో న్యూస్ లో వచ్చిన రిపోర్టు ప్రకారం.. దీనిపై అక్కడి మంత్రిత్వ శాఖతో అధికారులు చర్చిస్తున్నారు.

పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు ముప్పు

గత నెల 22న కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిలో 26 మంది పౌరులు కన్నుమూసిన విషయం తెలిసిందే కదా. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత త్రివిధ దళాలు కలిసికట్టుగా దాడులు నిర్వహించాయి. వీటివల్ల పాక్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహణపై పాక్ క్రికెట్ బోర్డు మల్లగుల్లాలు పడుతోంది. ఈ సీజన్లో ఇంకా 8 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో 4 నాకౌట్, 4 ప్లేఆఫ్స్ మ్యాచ్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భద్రత, రవాణాకు సంబంధించి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో పీఎస్ఎల్ ను రద్దు చేసే ఆలోచనలో పాక్ బోర్డు ఉన్నట్లు జియో న్యూస్ వెల్లడించింది.

ఆ సమావేశం తర్వాత..

ప్రస్తుతం పాకిస్థాన్ లోని పరిస్థితులు, టోర్నమెంట్ పై వాటి ప్రభావం గురించి పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులతో అక్కడి క్రికెట్ బోర్డు పెద్దలు చర్చించనున్నారు. ఆ సమావేశం తర్వాతే పీఎస్ఎల్ ను కొనసాగించాలా లేక రద్దు చేయాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకునే వీలుందని ఆ రిపోర్టు తెలిపింది.

ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతుండటం, ఎయిర్ స్పేస్ మూసివేయడం వల్ల మ్యాచ్ ల నిర్వహణ కోసం లాజిస్టికల్ రవాణా కష్టంగా మారింది. వీటివల్ల టోర్నీలో మ్యాచ్ లు ఆలస్యం లేదా రద్దు అయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో టోర్నీని వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దుబాయ్‌కు తరలి వెళ్తుందా?

అయితే ఈ లీగ్ లో మిగిలిన మ్యాచ్ లను వాయిదా లేదా రద్దు చేయకుండా టోర్నీని దుబాయ్ లేదా దోహాకు తరలించే ఆలోచన కూడా పీసీబీ చేస్తున్నట్లు మరో రిపోర్ట్ వెల్లడించింది. రావల్పిండి, ముల్తాన్, లాహోర్ లలో ఇంకా మ్యాచ్ లు జరగాల్సి ఉంది. వీటన్నింటినీ కరాచీకి తరలించే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది.

గురువారం (మే 8) రావల్పిండిలో కరాచీ కింగ్స్, పెషావర్ జల్మి మధ్య జరగాల్సిన మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పీఎస్ఎల్ లో ఆరు జట్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి ముల్తాన్ సుల్తాన్స్ తప్పుకోగా.. క్వెట్టా గ్లాడియేటర్స్ క్వాలిఫై అయింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం