ఐపీఎల్ 2025లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు (మే 21) వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ఓడితే ఢిల్లీ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలవాలంటే ముంబయిపై కచ్చితంగా గెలవాల్సిందే. మరోవైపు వాన గండం కూడా ఢిల్లీని భయపెడుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్ ల్లో 6 గెలిచింది. 5 ఓడింది. ఓ మ్యాచ్ వర్షంతో రద్దయింది. డీసీ ఖాతాలో 13 పాయింట్లున్నాయి. గత నాలుగు మ్యాచ్ ల్లో మూడు ఓడిపోయింది ఢిల్లీ. సన్ రైజర్స్ తో మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఐపీఎల్ 2025లో డీసీ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్కటి ఓడినా డీసీ పనైపోయినట్లే.
ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తో డీసీ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే ఈ రెండు మ్యాచ్ ల్లోనూ డీసీ గెలవాల్సిందే. అందుకే ఫస్ట్ ముంబయితో పోరు డీసీకి చావోరేవో లాంటింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ముంబయి లాస్ట్ ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకుంటుంది. ఢిల్లీ ఇంటిముఖం పడుతుంది.
డీసీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ కు వర్ష గండం ఉంది. నాలుగు రోజుల పాటు ముంబయికి ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే వర్షం కురుస్తోంది. వర్షంతో ఈ మ్యాచ్ రద్దయితే ఢిల్లీ, ముంబయి చెరో పాయింట్ పంచుకుంటాయి. అప్పుడు డీసీ 14, ఎంఐ 15 పాయింట్లతో ఉంటాయి. ఆ దశలో చివరి లీగ్ మ్యాచ్ లు కీలకంగా మారనున్నాయి.
వర్షం పడి ముంబయి తో మ్యాచ్ రద్దయితే ఢిల్లీకి ఎక్కువ నష్టం. అందుకే ఈ మ్యాచ్ వేదికను మార్చాలంటూ ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ బీసీసీఐని రిక్వెస్ట్ చేశాడు. ఇప్పటికే వాతావరణ పరిస్థితుల కారణంగా మే 23న బెంగళూరులో జరగాల్సిన సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ ను లక్నోకు తరలించారు.
సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ ను తరలించడంతో డీసీ, ముంబయి పోరు వేదికను కూడా మార్చాలని పార్థ్ జిందాల్ కోరుతున్నాడు. ఈ మేరకు ఈ మెయిల్ పంపించాడు. కానీ ఈ రోజే మ్యాచ్ కావడంతో ఇప్పటికిప్పుడూ స్టేడియాన్ని మార్చడం కుదరకపోవచ్చు.
‘‘ముంబయి లో భారీ వర్షాలు పడే అవకాశముందనే సూచనలున్నాయి. ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ వేదికను మార్చారు. రేపటి మ్యాచ్ (డీసీ వర్సెస్ ఎంఐ) మ్యాచ్ వేదికను కూడా మార్చండి’’ అని మంగళవారం (మే 20) రాత్రి పార్థ్ కోరాడు.
సంబంధిత కథనం