Karthik on Yash Dayal: టీమిండియా మాజీ స్పిన్నర్, కామెంటేటర్ మురళీ కార్తీక్ ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో కామెంటేటర్ గా ఉన్న కార్తీక్.. వివాదాస్పద కామెంట్స్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుండగా.. అతని కామెంట్స్ కు ఆర్సీబీ ఇచ్చి రిప్లై కూడా అదిరిపోయింది.
ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ గురించి మురళీ కార్తీక్ స్పందిస్తూ.. "ఓ టీమ్ కు చెత్తగా ఉన్న వ్యక్తి మరో టీమ్ కు నిధిగా మారిపోయాడు" అని అన్నాడు. అతడు ఈ కామెంట్స్ చేయడం వెనుక కారణం లేకపోలేదు. గతంలో యశ్ దయాల్ గుజరాత్ టైటన్స్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. గతేడాది ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్లో రింకు సింగ్ వరుసగా ఐదు సిక్స్ లు కొట్టి తమ జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్ టైటన్స్ యశ్ దయాల్ ను లైట్ తీసుకుంది. ఆ తర్వాత మొత్తానికే వదిలేయగా.. గత వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. కేవలం రూ.20 లక్షల బేస్ ప్రైస్ తో ఉన్న యశ్ దయాల్ కోసం ఆర్సీబీ ఏకంగా రూ.5 కోట్లు వెచ్చించింది. ఇప్పుడా బౌలరే ఆ టీమ్ తరఫున రాణిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఈ లెఫ్టామ్ పేసర్ 4 ఓవర్లలో కేవలం 23 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
దీంతో మురళీకార్తీక్ ఈ కామెంట్స్ చేశాడు. దీనిపై అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఓ లైవ్ మ్యాచ్ లో ఓ ప్లేయర్ ను నువ్వు చెత్త అంటావా అంటూ అతనిపై మండిపడ్డారు. గతంలోనూ కార్తీక్ ఇలాంటి కామెంట్స్ తో చిక్కుల్లో పడ్డాడు.
అయితే మురళీ కార్తీక్ కు ఆర్సీబీ టీమ్ దిమ్మదిరిగే రిప్లై ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ పై మ్యాచ్ గెలిచిన తర్వాత ఆర్సీబీ ఓ ట్వీట్ చేసింది. అందులో యశ్ దయాల్ ఫొటోను పోస్ట్ చేస్తూ.. అతడు నిధి అంతే.. అనే క్యాప్షన్ ఉంచింది. ఇది మురళీ కార్తీక్ కామెంట్స్ కు ఇచ్చి గట్టి కౌంటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్సీబీ ఇచ్చి రిప్లై అభిమానులను బాగా ఆకట్టుకుంది.
కార్తీక్ కు చాలా మంచి రిప్లై ఇచ్చారంటూ ఆర్సీబీని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. యశ్ దయాల్ 2022 ఐపీఎల్లో తొలిసారి ఆడాడు. ఇప్పటి వరకూ 17 మ్యాచ్ లు ఆడిన యశ్.. 16 వికెట్లు తీశాడు. నిజానికి గతేడాది గుజరాత్ టైటన్స్ తో ఉన్నప్పుడు కూడా కేకేఆర్ తో మ్యాచ్ లో తప్ప మిగతా మ్యాచ్ లలో మరీ అంత దారుణంగా కూడా ఏమీ బౌలింగ్ చేయలేదు.
అతన్ని పక్కన పెట్టిన గుజరాత్ టైటన్స్ ఫ్రాంఛైజీ కూడా.. వేలంలో మరోసారి ఆర్సీబీతో అతని కోసం పోటీ పడటం గమనార్హం. అలాంటి బౌలర్ పై మురళీ కార్తీక్ కామెంట్స్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది.