సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఝలక్. బెంగళూరులో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ జోరుకు ముంబయి ఇండియన్స్ బ్రేక్ వేసింది. 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట ఎలీస్ పెర్రీ (81) మెరుపులతో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో అమన్ జోత్ కౌర్ మూడు వికెట్లతో రాణించింది. ఛేదనలో 6 వికెట్లు కోల్పోయిన ముంబయి మరో బంతి మిగిలి ఉండగా గెలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (50), అమన్ జోత్ (34 నాటౌట్) విజయంలో కీలక పాత్ర పోషించారు.
డబ్ల్యూపీఎల్ 2025లో ఆర్సీబీతో మ్యాచ్ లో ఛేజింగ్ లో ముంబయి ఇండియన్స్ కు ధనాధన్ ఆరంభం దక్కింది. యాస్తిక (8) త్వరగానే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ హేలీ (15)తో కలిసి నాట్ సీవర్ (21 బంతుల్లో 42) స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. సీటర్ 9 ఫోర్లు కొట్టింది. దీంతో 5.5 ఓవర్లలో 66/1తో ముంబయి పటిష్ఠ స్థితిలో నిలిచింది. కానీ వెంటవెంటనే హేలీ, సీవర్, అమేలియా (2)ను ఔట్ చేసి ఆర్సీబీ పోటీలోకి వచ్చింది.
82/4తో కష్టాల్లో పడ్డ జట్టును ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆదుకుంది. టఫ్ కండీషన్లలో పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించింది. నెమ్మదిగా జట్టును గెలుపు దిశగా నడిపించింది. హర్మన్ కు అమన్ జోత్ మంచి సపోర్ట్ ఇచ్చింది. విజయానికి 24 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో హర్మన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో 17వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 18 బంతుల్లో 24 పరుగులతో ఈక్వేషన్ ఈజీగా మారింది.
36 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన హర్మన్ ను జార్జియా ఔట్ చేయడంతో ఉత్కంఠ రేగింది. ఆ తర్వాతి బంతికే సజన (0)ను ఎల్బీడబ్ల్యూ చేయడంతో చిన్నస్వామి స్టేడియం హోరెత్తింది. 18 ఓవర్లో 2 వికెట్లు పడగొట్టిన జార్జియా 2 పరుగులే ఇచ్చింది. కానీ 19వ ఓవర్ తొలి బంతికే అమన్ జోత్ సిక్సర్ తో మరింత డ్రామా నెలకొంది. ఆ ఓవర్ చివరి బంతికి కూడా అమన్ సిక్సర్ కొట్టడంతో ముంబయికి ఆఖరి ఓవర్లో 6 పరుగులు కావాల్సి వచ్చింది. నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు వచ్చాయి. అయిదో బంతికి 16 ఏళ్ల కమలిని ఫోర్ కొట్టి ముంబయిని గెలిపించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్ ను ఎలీస్ పెర్రీ నడిపించింది. ధనాధన్ షాట్లతో ఆమె చెలరేగింది. 43 బంతుల్లోనే 81 పరుగులు సాధించింది. ఇందులో 11 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. ప్రత్యర్థి బౌలర్లపై పెర్రీ విరుచుకుపడింది. కానీ మరో బ్యాటర్ నుంచి ఆమెకు సపోర్ట్ దక్కలేదు. కెప్టెన్ స్మృతి మంధాన (26), రిచా ఘోష్ (28) మాత్రమే కాస్తో కూస్తో రాణించారు.
సంబంధిత కథనం