MS Dhoni: సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లిన సీఎస్కే ప్లేయర్స్.. ‘ధోనీ.. ధోనీ’ అరుపులతో హోరెత్తించిన ఫ్యాన్స్: వీడియో
MS Dhoni - CSK: ఎంఎస్ ధోనీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఆటగాళ్లు.. సినిమా చూసేందుకు చెన్నైలోని ఓ థియేటర్కు వెళ్లారు. అక్కడ ధోనీని చూసిన ఫ్యాన్స్.. అరుపులతో మోతెక్కించారు. ధోనీ.. ధోనీ అంటూ అరిచారు.
MS Dhoni: ఐపీఎల్ 2024 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) శుభారంభం చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో శుక్రవారం (మార్చి 22) జరిగిన ఈ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై 6 వికెట్లతో తేడాతో విజయం సాధించింది. దీంతో అదిరే ఆరంభాన్ని అందుకుంది. ఎంటర్టైన్మెంట్ కోసం మహేంద్ర సింగ్ ధోనీతో పాటు చెన్నై ఆటగాళ్లు సినిమా చూసేందుకు ఓ థియేటర్కు వెళ్లారు.
ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్తో పాటు మరికొందరు సీఎస్కే ఆటగాళ్లు.. చెన్నైలోని సత్యం థియేటర్కు వెళ్లారు. ముందుగా థియేటర్లో వారు ఉన్నట్టు ప్రేక్షకులు గమనించలేదు. అయితే, క్రమంగా ఈ విషయం చాలా మందికి తెలిసింది. దీంతో షో పూర్తయ్యాక ధోనీ సహా సీఎస్కే ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని వేచిచూశారు. థియేటర్ నుంచి ధోనీ బయటికి వచ్చిన సమయంలో ఫ్యాన్స్ హెరెత్తించారు. ధోనీ.. ధోనీ అంటూ నినదించారు. దీంతో థియేటర్ పరిసరాలు దద్దరిల్లాయి.
సినిమా థియేటర్ వద్ద ఎంఎస్ ధోనీని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అరుపులతో మోతెక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఏ సినిమా చూశారంటే..
సత్యం థియేటర్లో సీఎస్కే ప్లేయర్లు మలయాళం మూవీ ‘మంజుమెల్ బాయ్స్’ చిత్రం చూశారని తెలుస్తోంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ భారీ వసూళ్లతో రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. కొడైకెనాల్ బ్యాక్డ్రాప్లో ఈ మలయాళ మూవీ తెరకెక్కటంతో తమిళనాడులోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఒక్క తమిళనాడులోనే ఈ మూవీ ఇప్పటి వరకు రూ.60కోట్ల వసూళ్లను దక్కించుకుంది.
రూ.200 కోట్ల కలెక్షన్లను సాధించిన తొలి మలయాళ మూవీగా మంజుమెల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మూవీకి సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొడువల్, దీపక్ పరంబోల్ కీలకపాత్రలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్యే ఎంజాయ్ చేయాలనుకున్న సీఎస్కే టీమ్ థియేటర్కు వెళ్లి చూసింది.
సీఎస్కే సూపర్ ఆరంభం
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు ఒక్క రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని కూడా ఎంఎస్ ధోనీ వదిలేశాడు. రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీని అందించాడు. ఆటగాడిగా ధోనీ ఈ సీజన్లో ఆడుతున్నాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అదిరే ప్రారంభం అందుకుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మార్చి 22న జరిగిన తొలి మ్యాచ్లో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 6 వికెట్లకు 173 రన్స్ చేసింది. ఈ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది చెన్నై. 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 176 రన్స్ చేసి గెలిచింది.
ఐపీఎల్ 2024 సీజన్లో తన తదుపరి మ్యాచ్ను గుజరాత్ టైటన్స్ జట్టుతో మార్చి 26వ తేదీన ఆడనుంది సీఎస్కే. ఈ మ్యాచ్ కూడా చెపాక్ స్టేడియంలో జరగనుంది.