హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో మరో వివాదం వెలుగుచూసింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని ఓ స్టాండ్ పేరు విషయంలో ఈసారి అభ్యంతరం తలెత్తింది. దీంతో భారత మాజీ కెప్టెన్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ పేరును స్టేడియంలోని నార్త్ స్టాండ్కు తొలగించాలని హెచ్సీఏ అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు.
ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కు మహమ్మద్ అజారుద్దీన్ పేరు ఉండడంపై హెచ్సీఏకు అనుబంధంగా ఉన్న లార్డ్స్ క్రికెట్ క్లబ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయంపై అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేసింది. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన పేరును తానే స్టాండ్కు అజారుద్దీన్ పెట్టుకున్నారని, ఇది చెల్లదని ఆ క్రికెట్ క్లబ్ పేర్కొంది.
ఈ ఫిర్యాదుపై హెచ్సీఏ అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తన తీర్పును నేడు (ఏప్రిల్ 19) వెల్లడించారు. తన పేరును తానే స్టాండ్కు పెట్టుకోవాలని అజారుద్దీన్ తీసుకున్న నిర్ణయం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందని తెలిపారు. ఆ నిర్ణయం చెల్లదని చెప్పారు. స్టేడియంలోని నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరును వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. టికెట్లపై కూడా ఇక నుంచి అజారుద్దీన్ స్టాండ్ అనే ప్రస్తావన ఉండకూడని జస్టిస్ ఈశ్వరయ్య తీర్పునిచ్చారు.
ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కు 2019 డిసెంబర్ నెలలో మహమ్మద్ అజారుద్దీన్ పేరును హెచ్సీఏ ఖరారు చేసింది. అప్పుడు హెచ్సీఏకు అధ్యక్షుడిగా అజారుద్దీనే ఉన్నారు. అజారుద్దీన్ స్టాండ్ను అప్పట్లో హైదరాబాదీ స్టైలిష్ ప్లేయర్, భారత లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రారంభించారు. మాజీ ప్లేయర్ వెంకటపతి రాజు, ప్రస్తుత పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఇప్పుడు సుమారు ఐదేళ్ల తర్వాత అంబుడ్స్మన్ ఆదేశాలు ఇచ్చారు.
కాగా, ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ నడుస్తుండగా.. ఇటీవల ఓ పెద్ద వివాదం తలెత్తింది. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని అదనపు కాంప్లిమెంటరీ టికెట్ల కోసం హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారనే విషయం చర్చనీయాశమైంది. తాము హైదరాబాద్ విడిచిపెళ్లిపోతామని ఫ్రాంచైజీ యాజమాన్యం చెప్పిందనేది సమాచారం కూడా బయటికి వచ్చింది. అయితే, ఈ వివాదం కొన్నాళ్లకు సద్దుమణిగింది.
సంబంధిత కథనం
టాపిక్