ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విఫలమయ్యారు. బ్యాటింగ్ కు కాస్త కష్టంగా ఉన్న పిచ్ పై చేతులెత్తేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, చివర్లో క్లాసెన్ కాస్త చెలరేగడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 రన్స్ చేసింది. చివరి 3 ఓవర్లలోనే 47 రన్స్ రావడం విశేషం.
సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ అరవీర భయంకరంగా ఉన్నా ఈ సీజన్లో వరుస వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ తో సొంతగడ్డపై మ్యాచ్ లో ఏకంగా 246 రన్స్ టార్గెట్ చేజ్ చేసి మళ్లీ గాడిలో పడినట్లు కనిపించినా.. మన బ్యాటర్లు మారలేదు. ట్రావిస్ హెడ్ (28). ఇషాన్ కిషన్ (2), నితీష్ కుమార్ రెడ్డి (19) మరోసారి విఫలమయ్యారు.
ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆ టీమ్ లో స్పిన్నర్ విల్ జాక్స్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక స్టార్ పేసర్ బుమ్రా.. 4 ఓవర్లలో 21 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
సన్ రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే దానికి కారణం మొదట్లో ఓపెనర్ అభిషేక్ శర్మ.. చివర్లో క్లాసెన్, అనికేత్ వర్మ మెరుపులే. అభిషేక్ 28 బంతుల్లోనే 7 ఫోర్లతో 40 రన్స్ చేశాడు. ఇక క్లాసెన్ 28 బంతుల్లో 37 రన్స్ చేశాడు. అతడు దీపక్ చహర్ వేసిన ఒకే ఓవర్లో 21 రన్స్ చేయడం విశేషం.
ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మరో 22 రన్స్ వచ్చాయి. ఈ ఓవర్ హార్దిక్ పాండ్యా వేయగా.. అనికేత్ రెండు, కమిన్స్ ఒక సిక్స్ బాదారు. ఇన్నింగ్స్ 18, 20వ ఓవర్లలో భారీగా పరుగులు రావడంతో సన్ రైజర్స్ మంచి స్కోరు సాధించగలిగింది. 19వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 4 రన్సే ఇవ్వడంతో సన్ రైజర్స్ మరింత భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు. మరి ఈ టార్గెట్ ను సన్ రైజర్స్ కాపాడుకుంటుందో లేదో చూడాలి.
సంబంధిత కథనం