రోహిత్ కు ఏమైంది?.. ఐపీఎల్ 2025లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో హిట్ మ్యాన్ పై వచ్చిన ప్రశ్నలివి. కానీ ఫామ్ కాదు క్లాస్ శాశ్వతం అంటూ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. ఆదివారం (ఏప్రిల్ 20) వాంఖడేలో సీఎస్కేపై విధ్వంసం చూపించాడు. ఛేజింగ్ లో ఒక వికెట్ మాత్రమే కోల్పోయిన ముంబయి 15.4 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది.
రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టడంతో ముంబయి 9 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. 8 మ్యాచ్ ల్లో నాలుగో విజయంతో ప్లేఆఫ్స్ ఆశలను ముంబయి సజీవంగా ఉంచుకుంది. మరోవైపు 8 మ్యాచ్ ల్లో ఆరో ఓటమితో సీఎస్కే కథ ముగిసినట్లే.
ఐపీఎల్ 2025లో సీఎస్కేతో ఛేజింగ్ లో ముంబయి ఓపెనర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా వరుస ఫెయిల్యూర్స్ కు చెక్ పెడుతూ రోహిత్ శర్మ బౌండరీల వేటలో దూసుకెళ్లాడు. ఒవర్టన్ బౌలింగ్ లో సిక్సర్ తో హిట్ మ్యాన్ దంచుడు మొదలెట్టాడు. ఖలీల్ వేసిన తర్వాతి ఓవర్లో ఓ సిక్సర్, రెండు ఫోర్లు కొట్టాడు. రికిల్టన్ (24) కూడా జోరు కొనసాగించడంతో ముంబయి పవర్ ప్లేలో 62 పరుగులు చేసింది.
పవర్ ప్లే ముగిసిన వెంటనే బౌలింగ్ కు వచ్చిన జడేజా.. రికిల్టన్ వికెట్ దక్కించుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ సునామీ సీఎస్కేను ముంచేసింది. అగ్నికి వాయువులా సూర్య, రోహిత్ కలిసి రెచ్చిపోయారు. అశ్విన్ బౌలింగ్ లో స్లాగ్ స్వీప్ తో రోహిత్ కొట్టిన సిక్సర్ ఆకట్టుకుంది.
జడేజాను టార్గెట్ చేసుకున్న సూర్య తన ట్రేడ్ మార్క్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్ లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. మరోవైపు రోహిత్ ఈ సీజన్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ ఇద్దరూ దంచికొట్టడంతో టార్గెట్ స్పీడ్ గా కరుగుతూ వచ్చింది.
సూర్య 26 బాల్స్ లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. అక్కడి నుంచి మ్యాచ్ తర్వగా ముగించాలనే తొందరలో రోహిత్, సూర్య మరింత స్పీడ్ పెంచారు. పతిరణ బౌలింగ్ లో రోహిత్ ఓ సిక్సర్ కొట్టగా.. సూర్య వరుసగా రెండు సిక్సర్లతో మ్యాచ్ ముగించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. రవీంద్ర జడేజా, శివమ్ దూబె హాఫ్ సెంచరీలతో పోరాడే స్కోరు సాధించింది. సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఐపీఎల్ అరంగేట్రంలో 17 ఏళ్ల ఆయూష్ మాత్రె (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టాడు.
ఆ తర్వాత దూబె, జడ్డూ సత్తాచాటారు. జడేజా 35 బంతుల్లో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతను 4 ఫోర్లు, 2 సిక్సర్లు దంచాడు. దూబె 32 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఇందులో 2 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. ముంబయి బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం