ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మంచి స్కోరే సాధించింది. శనివారం (ఏప్రిల్ 19) జైపూర్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. మార్క్రమ్ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆయూష్ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, ఓ సిక్సర్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖర్లో అబ్దుల్ సమద్ (30 నాటౌట్) చెలరేగాడు.
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభంలో తడబడింది. టపటపా మూడు వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్ లో ఉన్న మిచెల్ మార్ష్ (4), పూరన్ (11)తో పాటు కెప్టెన్ పంత్ (3) మరోసారి ఫెయిలయ్యారు.
అయినా మరో ఎండ్ లో మార్క్రమ్ చెలరేగడంతో లక్నో కుదురుకుంది. ఆయూష్ బదోనితో కలిసి మార్క్రమ్ టీమ్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. అయినా స్కోరుబోర్డు స్లోగానే సాగింది. హసరంగ బౌలింగ్ లో మార్క్రమ్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. 10 ఓవర్లకు ఆ టీమ్ 76/3తో నిలిచింది.
మార్క్రమ్తో కలిసి బదోని కూడా రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కచ్చితమైన టైమింగ్ తో షాట్లు కొట్టాడు. అలవోకగా బౌండరీలు రాబట్టాడు. కానీ తుషార్ దేశ్ పాండే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లు తీక్షణ, హసరంగ బ్రేక్ వేశారు. దీంతో రన్ రేట్ ఏ దశలోనూ 9 దాటలేదు. గేరు మార్చే సమయంలో మార్క్రమ్ను ఔట్ చేసి.. లక్నోను హసరంగ చావు దెబ్బ కొట్టాడు.
హాఫ్ సెంచరీ తర్వాత బదోని కూడా పెవిలియన్ చేరిపోయాడు. దీంతో లక్నో భారీ స్కోరు ఆశలకు బ్రేక్ పడింది. 45 బాల్స్ ఆడిన మార్క్రమ్ 66 రన్స్ చేశాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. 34 బాల్స్ లో బదోని 50 రన్స్ చేశాడు. అతను 5 ఫోర్లు, ఓ సిక్సర్ దంచాడు.
160 కూడా దాటుతుందా లేదా అనుకున్న లక్నో స్కోరు 180కి చేరిందంటే అందుకు ప్రధాన కారణం అబ్దుల్ సమద్. ఈ హిట్టర్ ఆఖర్లో చెలరేగాడు. ముఖ్యంగా సందీప్ వేసిన లాస్ట్ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. సమద్ 10 బాల్స్ లోనే 30 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు పడగొట్టాడు.
సంబంధిత కథనం