ఐపీఎల్ 2025లో పూరన్ విధ్వంసం.. లక్నో సూపర్ జెయింట్స్ విజయం.. ఈ ఫార్ములా కొనసాగుతోంది. మరోసారి పూరన్ (34 బంతుల్లో 61; ఓ ఫోర్, 7 సిక్సర్లు), మార్క్రమ్ (31 బంతుల్లో 58; 9 ఫోర్లు, ఓ సిక్సర్) చెలరేగారు. దీంతో శనివారం (ఏప్రిల్ 12) హోం గ్రౌండ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తుచేసింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (56), శుభ్మన్ (60) మెరుపులతో 180/6 స్కోరు చేసింది. ఛేజింగ్ లో 4 వికెట్లు కోల్పోయిన లక్నో 19.3 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. లక్నోకు ఇది వరుసగా మూడో విక్టరీ. జీటీకి రెండో ఓటమి.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ పై ఛేజింగ్ లో మార్క్రమ్తో కలిసి కెప్టెన్ పంత్ ఓపెనర్ గా బరిలో దిగాడు. మిచెల్ మార్ష్ ఇంజూరీతో మ్యాచ్ కు దూరమవడంతో పంత్ ఓపెనర్ అవతారం ఎత్తాడు. కానీ మళ్లీ (18 బంతుల్లో 21) ఫెయిలయ్యాడు. అయినా ఛేదనలో లక్నో దూసుకెళ్లిందంటే మార్ క్రమ్, పూరన్ మెరుపులే కారణం.
మొదట మార్క్రమ్ చెలరేగితే.. ఆ తర్వాత పూరన్ రెచ్చిపోయాడు. గుజరాత్ బౌలర్లను ఈ జోడీ ఓ ఆటాడుకుంది. ప్రసిద్ద్ బౌలింగ్ లో వరుస బంతుల్లో మార్క్రమ్ రెండు క్యాచ్ లను జీటీ వదిలేయడం దెబ్బతీసింది. ఈ అవకాశాలను యూజ్ చేసుకుని మార్క్రమ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 26 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు.
మరోవైపు పూరన్ సెన్సేషనల్ ఫామ్ కొనసాగించాడు. స్పిన్నర్ సాయి కిశోర్ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. మార్క్రమ్ను ప్రసిద్ధ్ ఔట్ చేసినా.. దంచుడు కొనసాగించిన పూరన్ 23 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. ఈ సీజన్ లో అతనికిది నాలుగో హాఫ్ సెంచరీ. 34 బంతుల్లో 61 పరుగులు చేసిన పూరన్ 7 సిక్సర్లు కొట్టాడు.
ఛేజింగ్ చివర్లో పూరన్ ఔటయ్యాడు. అప్పటికీ విజయం కోసం లక్నో 28 బంతుల్లో 26 పరుగులు చేయాల్సి ఉంది. గుజరాత్ బౌలర్లు టైట్ బౌలింగ్ వేయడంతో ఏమైనా ఉత్కంఠ రేగుతుందోమో అనిపించింది. మిల్లర్ (7)ను సుందర్ బౌల్డ్ చేశాడు. లాస్ట్ ఓవర్లో 6 రన్స్ కావాల్సి ఉండగా.. రెండో బాల్ కు ఫోర్ కొట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ ఆయూష్ బదోని (28 నాటౌట్), వెంటనే సిక్సర్ తో మ్యాచ్ ముగించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56; 7 ఫోర్లు, ఓ సిక్సర్), శుభ్మన్ గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, ఓ సిక్సర్) దంచికొట్టారు. ఈ జోడీ ఫస్ట్ వికెట్ కు 12.1 ఓవర్లలోనే 120 పార్ట్నర్షిప్ నెలకొల్పింది. ఈ ఓపెనర్లు ఇద్దరూ పోటీపడీ మరీ బౌండరీలు బాదారు.
కానీ వరుస ఓవర్లలో ఓపెనర్లను ఔట్ చేసిన ఎల్ఎస్జీ అద్భుతంగా పుంజుకుంది. 200 స్కోరు చేయకుండా గుజరాత్ కు బ్రేక్ వేసింది. శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బట్లర్ (16), వాషింగ్టన్ సుందర్ (2) ఫెయిల్ అయ్యారు.
సంబంధిత కథనం