ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఫైరయ్యాడు. ఇండియన్ క్రికెటర్లు పాంటింగ్ కు కనిపించడం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2025 ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఆ టీమ్ గెలిచి, తొలిసారి ట్రోఫీ ముద్దాడుతుందనే అంచనాలున్నాయి. కానీ పంజాబ్ ట్రోఫీ లేకుండానే 2025 సీజన్ ను ముగిస్తుందని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు.
శనివారం (ఏప్రిల్ 26) ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఫస్ట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ 200కు పైగా స్కోరు చేసింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో మ్యాక్స్ వెల్ కోసం ఇండియన్ ప్లేయర్స్ ను కోచ్ పాంటింగ్ పక్కన పెడుతున్నాడని మనోజ్ తివారీ మండిపడ్డాడు.
ప్రభ్ సిమ్రన్ సింగ్ 83 పరుగులు చేసి ఔటయ్యాక, నేహాల్ వధేరాను 4వ స్థానంలో పంపాలని తివారీ కోరుకున్నాడు. కానీ, పాంటింగ్ మ్యాక్స్ వెల్ను ఆడించాడు. అతను 8 బంతుల్లో 7 పరుగులు చేసి ఔటయ్యాడు.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్లో 20 బంతులు మాత్రమే మిగిలి ఉండగా, 200 ప్లస్ స్కోర్ లక్ష్యంగా పెట్టుకున్న పంజాబ్.. శశాంక్ సింగ్ను బ్యాటింగ్ కు పంపించాల్సిందని మనోజ్ తివారి భావించాడు. కానీ ఆ టీమ్ అయిదో స్థానంలో యాన్సెన్, ఆ తర్వాత ఇంగ్లిష్ ను పంపించింది.
"నా అనుభవం ప్రకారం, పంజాబ్ జట్టు ఈ సీజన్లో ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. ఎందుకంటే నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ వంటి ఫామ్ లో ఉన్న భారతీయ బ్యాటర్లను కోచ్ పంపలేదు. బదులుగా విదేశీ ఆటగాళ్లపై నమ్మకం ఉంచాడు. కానీ వారు విఫలమయ్యారు. దీనివల్ల డౌన్ ఆర్డర్ లో ఇండియన్ ప్లేయర్లపై నమ్మకం స్పష్టమవుతోంది. అతను ఈ విధంగా కొనసాగిస్తే, టాప్ టూలో ఉన్నప్పటికీ టైటిల్ వారికి దూరమే అని నా అభిప్రాయం" అని మనోజ్ తివారీ ట్వీట్ చేశాడు.
శనివారం కేకేఆర్ తో పాయింట్స్ పంచుకున్న తర్వాత పాయింట్స్ టేబుల్ లో పంజాబ్ నాలుగో స్థానంలో ఉంది. తొమ్మిది మ్యాచ్లలో ఐదు గెలుపులు, మూడు ఓటములు సాధించింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 30న చెన్నై సూపర్ కింగ్స్ తో ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత మే 4న ధర్మశాలలో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది.
సంబంధిత కథనం