డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ పై భారీ స్కోరు చేసింది. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయినా.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 రన్స్ చేయడం విశేషం. రఘువంశీ, రింకు సింగ్ రాణించారు. ఆ టీమ్ కు మొదట్లోనే మెరుపు ఆరంభం లభించగా.. ముగింపు మాత్రం ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. చివరి మూడు ఓవర్లలోనే ఆ టీమ్ ఐదు వికెట్లు కోల్పోయింది.
కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ లో ఆంగ్క్రిష్ రఘువంశీ, రింకు సింగ్ భాగస్వామ్యమే కీలకంగా నిలిచింది. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 61 పరుగులు జోడించారు. రఘువంశీ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. ఇక రింకు సింగ్ 36 రన్స్ చేశాడు. అతడు 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అయితే ఈ ఇద్దరు వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో కేకేఆర్ ఆశించినంత స్కోరు చేయలేకపోయింది.
అంతకుముందు కేకేఆర్ ఓపెనర్లు గుర్బాజ్, నరైన్ ఇన్నింగ్స్ ధాటిగా మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ కేవలం 3 ఓవర్లలోనే తొలి వికెట్ కు 48 పరుగులు జోడించడం విశేషం. గుర్బాజ్ 12 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్స్ తో 26 రన్స్ చేశాడు. ఇక సునీల్ నరైన్ 16 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 27 రన్స్ చేయడం విశేషం. కెప్టెన్ రహానే కూడా ధాటిగా ఆడి 14 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 26 రన్స్ చేశాడు. రసెల్ చివర్లో 9 బంతుల్లో 17 రన్స్ చేసి రనౌటయ్యాడు. చివరి ఐదు ఓవర్లలో కేకేఆర్ 45 రన్స్ మాత్రమే చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.