చెన్నై సూపర్ కింగ్స్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది కోల్కతా నైట్ రైడర్స్. కెప్టెన్ రహానే, రసెల్, మనీష్ పాండే రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 రన్స్ చేసింది. సీఎస్కే తరఫున చివరి ఓవర్ వేసిన పతిరన కేవలం 6 పరుగులే ఇవ్వడంతో కేకేఆర్ మరింత భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు.
కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్ ను ముగ్గురు ప్లేయర్స్ నిర్మించారు. మొదట్లో కెప్టెన్ అజింక్య రహానే, మధ్యలో ఆండ్రీ రసెల్, చివర్లో మనీష్ పాండే చెలరేగారు. దీంతో కేకేఆర్ మంచి స్కోరు సాధించగలిగింది. ఈ కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
మొదట్లోనే ఓపెనర్ గుర్బాజ్ (11) వికెట్ కోల్పోయింది. ఓ ఫోర్, సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించిన అతడు.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఆ తర్వాత మరో ఓపెనర్ సునీల్ నరైన్ కూడా కాసేపు ధాటిగా ఆడాడు. అతడు 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 26 రన్స్ చేశాడు.
అటు కెప్టెన్ అజింక్య రహానే మరోసారి చెలరేగాడు. అతడు మాంచి ఊపు మీద కనిపించాడు. మరో హాఫ్ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే 33 బంతుల్లో 48 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి.
ఇక కేకేఆర్ ఇన్నింగ్స్ మధ్యలో ఆండ్రీ రసెల్ రెచ్చిపోయాడు. 71 పరుగులకే 3 వికెట్లు, 103 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన కేకేఆర్ కు రసెల్ మంచి స్కోరు అందించాడు. తనదైన స్టైల్లో బౌలర్లపై విరుచుకుపడిన అతడు.. 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 38 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ మధ్యలో అతని మెరుపుల వల్లే కేకేఆర్ ఆ మాత్రం స్కోరైనా చేసింది.
ఇక చివర్లో మనీష్ పాండే చెన్నై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. చివరి వరకూ అతడు క్రీజులో ఉన్నాడు. పాండే 28 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో 36 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.