ఐపీఎల్ 2025లో ప్రత్యర్థి గ్రౌండ్ లో విజయ పరంపరను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనసాగిస్తోంది. ఆదివారం (ఏప్రిల్ 20) ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్లతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. ఛేజింగ్ లో విరాట్ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, ఓ సిక్సర్), దేవ్దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అదరగొట్టారు.
ఛేజింగ్ లో ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 157/6 స్కోరు చేసింది. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అయిదో విజయాన్ని అందుకుంది.
ఓ మోస్తారు ఛేదనలో కింగ్ కోహ్లి మరోసారి సత్తాచాటాడు. ఛేజింగ్ లో తిరుగులేని విరాట్ అదరగొట్టాడు. కోహ్లి, దేవ్దత్ కలిసి ఆర్సీబీని గెలుపు దిశగా నడిపించారు. ఛేజింగ్ లో ఫస్ట్ ఓవర్లో ఫిల్ సాల్ట్ (1)ను అర్ష్ దీప్ ఔట్ చేశాడు. కానీ ఆ వికెట్ తీసినందుకు పంజాబ్ కింగ్స్ బాధపడే ఉంటుంది. ఎందుకంటే కోహ్లి, దేవ్దత్ కలిసి పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశారు.
కోహ్లి ఇన్నింగ్స్ నిర్మిస్తే.. దేవ్దత్ బాదుడు కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లపై ఈ జోడీ విరుచుకుపడింది. పవర్ ప్లే లో 54/1తో నిలిచిన ఆర్సీబీ గెలుపు దిశగా సాగిపోయింది. చాహల్ బౌలింగ్ లో దేవ్దత్ సూపర్ సిక్సర్ కొట్టాడు. మధ్య ఓవర్లలో స్కోరు నెమ్మదించినా.. జేవియర్ ఓవర్లో పడిక్కల్ సిక్సర్, ఫోర్ తో మళ్లీ వేగాన్ని అందుకుంది.
30 బంతుల్లో దేవ్దత్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆ వెంటనే దేవ్దత్ ఔటైనా.. కోహ్లి మాత్రం క్రీజులో నిలబడ్డాడు. సమయోచిత ఇన్నింగ్స్ తో టీమ్ ను విజయానికి చేరువ చేశాడు. చాహల్ బౌలింగ్ లో కోహ్లి వరుసగా 6, 4 కొట్టాడు. నేహాల్ బౌలింగ్ లో సిక్సర్ తో మ్యాచ్ ముగించాడు జితేశ్. 54 బంతుల్లో 73 నాటౌట్ గా నిలిచిన విరాట్ 7 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు.
ముల్లాన్ పూర్ లోని స్లో పిచ్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ లో అదరగొట్టింది. పిచ్ కండీషన్లను బెటర్ గా యూజ్ చేసుకుని పంజాబ్ కింగ్స్ ను కట్టడి చేసింది. స్పిన్నర్లు కృనాల్ పాండ్య, సుయాష్ శర్మ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. భువనేశ్వర్ కుమార్ వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఆ టీమ్ లో ప్రభ్ సిమ్రన్ (33), శశాంక్ సింగ్ (31 నాటౌట్), జోష్ ఇంగ్లిస్ (29) కాస్త ఫర్వాలేదనిపించారు.
సంబంధిత కథనం