ఆర్సీబీ కల నిజమైంది. ఆ టీమ్ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఆరు పరుగుల తేడాతో ఓడించింది. దీంతో 18 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ చివరకు ఐపీఎల్ ట్రోఫీని ఎత్తాడు. 35 బంతుల్లో 43 పరుగులతో ఆర్సీబీ తరపున ఫైనల్లో అత్యధిక స్కోరు చేశాడు కోహ్లి. ఛేజింగ్ లో బౌలర్లు అదరగొట్టి ఆర్సీబీని గెలిపించారు.
ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ అందుకున్న తర్వాత విరాట్ కోహ్లి ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
‘‘ఈ జట్టు నా కలను సాధ్యం చేసింది. నేను ఎప్పటికీ మర్చిపోలేని సీజన్ ఇది. గత 2.5 నెలలుగా మేము ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించాం. అత్యంత దారుణమైన సమయాల్లోనూ ఆర్సీబీని వదలని ఫ్యాన్స్ కోసమే ఇది. అన్ని సంవత్సరాల హార్ట్ బ్రేక్స్, నిరాశకు సంబంధించింది. ఈ టీమ్ కోసం ఆడుతూ మైదానంలో వదిలిన ప్రతి అంగుళం కృషి ఇది’’ అని కోహ్లి పోస్టులో పేర్కొన్నాడు.
‘‘ఐపీఎల్ ట్రోఫీ పరంగా చూస్తే.. నిన్ను (ట్రోఫీ) ఎత్తుకోవడానికి, సంబరాలు చేసుకోవడానికి 18 ఏళ్లు వెయిట్ చేయించావ్ మై ఫ్రెండ్. కానీ ఆ వెయిటింగ్ కచ్చితంగా ఎంతో విలువైంది’’ అని కోహ్లి ఆ పోస్టులో పేర్కొన్నాడు. ఐపీఎల్ ట్రోఫీని ఫ్రెండ్ గా పేర్కొన్నాడు విరాట్.
2008లో సీజన్ ఆరంభం నుంచి ఐపీఎల్ టైటిల్ కోసం ఆర్సీబీ పోరాడింది. మూడు సార్లు ఫైనల్ కు చేరి ట్రోఫీకి అడుగు దూరంలో ఆగిపోయింది. మూడు ఫైనల్స్ లో ఓడింది. కానీ ఈ సారి మాత్రం ఆ టీమ్ వదల్లేదు. కప్ ను చేజార్చుకోలేదు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. 18 ఏళ్ల పోరాటానికి ఫలితాన్ని దక్కించుకుంది.
పంజాబ్ కింగ్స్ తో ఫైనల్లో కోహ్లి టాప్ స్కోరర్ గా నిలిచాడు. విరాట్ దూకుడుగా ఆడలేదు. మూడు ఫోర్లు మాత్రమే కొట్టాడు. కానీ తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్లో జట్టుకు విలువైన పరుగులు అందించాడు. ఆ రన్స్ ఆర్సీబీ విజయంలో కీలకంగా మారాయి. ఆర్సీబీని 6 పరుగుల తేడాతో గెలిపించాయి. మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్, జితేశ్ కూడా కీలక పరుగులు సాధించారు.
ఐపీఎల్ ట్రోఫీతో విరాట్ కోహ్లి కెరీర్ పరిపూర్ణమైంది. ఇప్పటికే ఓ వన్డే, టీ20 ప్రపంచకప్ అతని ఖాతాలో ఉన్నాయి. రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకున్నాడు. ఓ సారి టెస్టు గద కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ ట్రోఫీతో అతని కెరీర్ కంప్లీట్ అయింది.
సంబంధిత కథనం