ఐపీఎల్ 2025 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. మంగళవారం (ఏప్రిల్ 8) ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో కేవలం 4 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, ఈ మ్యాచ్లో పంత్ ఓ మాస్టర్ ప్లాన్ అమలు చేశాడని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అంటున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 238 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్కతా కూడా లక్ష్యఛేదనలో దూకుడుగా ఆడింది. గెలుపు దిశగా అదరగొట్టింది. అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్ ఓ దశలో దుమ్మురేపారు. 12 ఓవర్లలోనే కేకేఆర్ 2 వికెట్లకు 149 పరుగులతో గెలుస్తుందనే పటిష్ట స్థితికి చేరింది. రహానే, వెంకటేశ్ అయ్యర్ 48 బంతుల్లోనే 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అయితే, 13వ ఓవర్ చివర్లో రహానేను లక్నో పేసర్ శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో లక్నోకు బ్రేక్త్రూ దక్కింది. ఆ తర్వాత కేకేఆర్ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. చివరికి లక్నో గెలిచింది. అయితే, 13వ ఓవర్లో పంత్ ఓ ప్లాన్ అమలు చేశాడనే మాటలు వినిపిస్తున్నారు.
13వ ఓవర్ ప్రారంభంలో రిషబ్ పంత్ నడుము నొప్పితో బాధపడ్డాడు. దీంతో లక్నో ఫిజియో గ్రౌండ్లోకి వచ్చాడు. పంత్కు అక్కడే ట్రీట్మెంట్ చేశాడు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచింది. ఆ తర్వాత మళ్లీ మొదలైంది. అయితే.. రహానే, వెంకటేశ్ అయ్యర్ జోరుగా ఆడుతుండటంతో వారి లయను దెబ్బ తీయాలనే బ్రేక్ వచ్చేలా ఫేక్ ఇంజూరి ప్లాన్ను పంత్ అమలు చేశాడని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
గతేడాది 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పంత్ ఫేక్ ఇంజూరి ప్లాన్ అమలు చేశాడు. ఆ ఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడుతుండటంతో ఆ జట్టు గెలిచేలా కనిపిచింది. ఓ దశలో గాయంతో అల్లాడుతున్నట్టు పంత్ చేశాడు. దీంతో ఆటకు బ్రేక్ పడింది. ఆ వెంటనే క్లాసెన్ ఔటయ్యాడు. వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి దక్షిణాఫ్రికా ఓడింది. భారత్ టైటిట్ పట్టింది. అయితే, గాయమైనట్టు తాను అప్పుడు కావాలనే నాటకం ఆడానని, దక్షిణాఫ్రికా బ్యాటర్ల లయను దెబ్బకొట్టేందుకు అలా చేశానని పంత్ స్వయంగా చెప్పాడు.
టీ20 ప్రపంచకప్లో ఫాలో అయిన మాస్టర్ ప్లాన్నే ఐపీఎల్లో కోల్కతాతో మ్యాచ్లో పంత్ ఫాలో అయ్యాడని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. మరి పంత్ నిజంగానే ఇబ్బంది పడ్డాడా.. లేకపోతే కావాలనే చేశాడా అనేది ఇప్పటికైతే సస్పెన్సే.
సంబంధిత కథనం